సంగారెడ్డి, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : ఐఐటీలు కేవలం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేయడమే కాకుండా పరిశోధనల ద్వారా దేశానికి, ప్రజలకు మేలు జరిగేలా ఆవిష్కరణలు చేస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. గురువారం సంగారెడ్డి మండలం కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ఐఐటీలు అన్నీ ఇకపై పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలోని 23 ఐఐటీలు పరిశోధలనపై మరింత దృష్టి పెట్టేలా ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఐఐటీల్లో జరిగే పరిశోధనలకు ప్రభుత్వ రంగ సంస్థలైన ఇస్రో, డీఆర్డీవో లాంటి సంస్థలు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఇతర పరిశ్రమలు సైతం ఐఐటీలతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఐఐటీల్లో చేపట్టిన నూతన ఆవిష్కరణలు ఉత్పత్తులుగా మారేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దేశంలోని 23 ఐఐటీలు ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్వెంటివ్ టెక్నాలజీస్’ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ ఎగ్జిబిషన్లో ఐఐటీల్లోని 75 నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగే ఇన్వెంటివ్ ఎగ్జిబిషన్కు ఐఐటీ హైదరాబాద్ నుంచి ఆరు నూతన ఆవిష్కరణలు ఎంపికైనట్లు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్లో 3800 మంది బీటెక్, 1300 మంది మాస్టర్స్, 2008 మంది ఎంటెక్, 400 మంది పీహెచ్డీ విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. పీహెచ్డీ, పీజీ విద్యార్థులు పరిశోధనలు జరుపుతున్నట్లు వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నుంచి 100 స్టార్టప్ కంపెనీలు వచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
ఐఐటీ హైదరాబాద్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఫ్యాబ్ ఫెసిలిటీ ఏర్పాటులో భాగంగా సెమీకండక్టర్ల రంగంపై రూ.77వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. సెమీకండక్టర్ రంగానికి అవసరమైన మానవవనరులను అందించడంపై ఐఐటీ హైదరాబాద్ దృష్టి సారించినట్లు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ కొత్తగా ఐసీ డిజైన్ ఆండ్ మాన్యుఫాక్చర్ బీటెక్ కోర్సును ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే సెమీ కండక్టర్స్ డివైస్ అండ్ మెటీరియల్ ఎంటెక్ కోర్సు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
దేశంలో మొట్టమొదటి సారిగా ఐఐటీ హైదరాబాద్ సిస్టమ్ ప్యాకేజింగ్ ఎంటెక్ కోర్సును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్లో ప్రవేశపెట్టిన నూతన యూజీ, పీజీ కోర్సుల వివరాలను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)కి అందజేసినట్లు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్లో బోధన పద్ధ్దతులను దేశంలోని ఇతర ఇంజినీరింగ్ కళాశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కమ్యూనికేషన్ రంగంలో ఐఐటీ హైదరాబాద్ జరుపుతున్న పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా 5జీకి సంబంధించి ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ దేశీయ టెలికమ్యునికేషన్ కంపెనీలు వాడుకునేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. 6జీకి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన నూతన ఆవిష్కరణల గురించి ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు నిశాంత్, దేబరాజ్ భట్టాచార్య, జోత్సేనేందు గిరి, అనిల్, ప్రసాద్ వివరించారు. విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ కృష్ణమోహన్, ఐఐటీ పీహెచ్డీ విద్యార్థులు పాల్గొన్నారు.