పుల్కల్, అక్టోబర్ 6: దసరా పండుగ ఓ ఇంటిలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అందోల్ మండలం గడిపెద్దాపూర్ గ్రా మానికి చెందిన బచ్చలి పవన్ కల్యాణ్ (21) సంతోషంగా ఉండాల్సిన సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులతో కలిసి సరదాగా సింగూరు ప్రాజెక్టుకు వెళ్లొద్దామని బుధవారం సింగూరు ప్రాజెక్టుకు ద్విచక్రవాహనంపై ముగ్గురు వచ్చారు. ప్రాజెక్టు సమీపంలో మద్యం తాగిన పవన్ కల్యాణ్ తనతో వచ్చిన ఇద్దరు మిత్రులతో కలిసి ప్రాజెక్టు నది ఒడ్డుపై స్నానానికి నీటిలో దిగాడన్నారు. అయితే జల విద్యుత్ కేంద్రం నుంచి ప్రవహిస్తున్న నీటిని గమనించని పవన్ కల్యాణ్ ఆ నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడన్నారు.
గురువారం ఉదయంనుంచి సాయంత్రం నాలు గు గంటల వరకు ముగ్గురు గజ ఈతగాళ్లు యువకుడి కోసం గాలించినా లభించ లేదన్నారు.అతనితో వచ్చిన ఇద్దరి మిత్రులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కుమార గణేశ్ విలేకరులతో తెలిపారు.
తల్లి దండ్రులకు తీరని శోకం
బచ్చలి కిషన్,ఇందిరలకు ముగ్గురు సంతానం ఇంటికి పెద్ద కుమారుడు పవన్ కల్యాణ్,చిన్న కుమారుడు ప్రశాం త్, కూతురు మధులత.ప్రాజెక్టులో పడి పవన్ కళ్యాణ్ గల్లంతయ్యాడని తెలిసుకున్న తల్లి దండ్రులకు తీరని శోకం మిగిలింది,వారు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఫొటో గ్రాఫర్గా చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న పెద్ద కుమారుడు పవన్ కల్యాణ్(21)ప్రాజెక్టులో పడి గల్లంతు కావడంతో మాకు దిక్కెవరు అంటూ వారు బోరున విలపించారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
అందోల్, అక్టోబర్ 6: చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వట్పల్లి మండలం పోతులబొగుడలో జరిగింది. గ్రామానికి చెందిన సీహెచ్. మచ్చేందర్(35) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. భార్య విజయమేరీ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై విఠల్ తెలిపారు.