సిద్దిపేట, అక్టోబర్ 6: దసరా పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని, సిద్దిపేట ఇంకా అభివృద్ధి జరిగి అందరూ ఆనందంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కోరుకున్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట పట్టణలోని నర్సాపూర్, రంగధాంపల్లిల్లో జరిగిన దసరా వేడుకలకు మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ఈ విజయదశమి అందరి జీవితాల్లో విజయం చేకుర్చాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అందరి ప్రేమ, ఆశీస్సులతో దినదినాభివృద్ధి చేసుకుంటున్నామని, సిద్దిపేటను సరస్వతి నిలయంగా మార్చుకుంటున్నట్లు చెప్పారు. మన పిల్లలు ఎక్కడికి వెళ్లకుండా, ఇక్కడే చదివేలా అన్ని విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వచ్చే దసరా నాటికి 1500 పిల్లలు ఉద్యోగాలు చేసుకునే ఐటీ టవర్ ప్రారంబించుకోనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లోనే కాదు.. సిద్దిపేటలోను ఐటీ ఉద్యోగాలు చేసుకునేలా ఐటీ హబ్ను జనవరి ఒకటిన ప్రారంభించుకుందామన్నారు. రూ.వంద కోట్లతో రంగనాయకసాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుందామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలే తన కుటుంబమని, తన ఊపిరి ఉన్నంత వరకు శక్తి వంచన లేకుండా ప్రజా సేవ చేస్తానని మంత్రి పేర్కొన్నారు. వచ్చే దసరా నాటికి సిద్దిపేటకు రైలు వస్తదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, నేతలు పాల్గొన్నారు.