వెల్దుర్తి, ఫిబ్రవరి 19 : విద్యాభివృద్ధిలో భాగంగా సీఎం కేసీఆర్ చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలలు అభివృద్ధి చేయటంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి సూచించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహణపై శనివారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలో ఎంపికైన పాఠశాలల హెచ్ఎంలు, సర్పంచులు, విద్యా కమిటీ చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీపీ కార్యక్రమం విధి విదానాలు, చేపట్టాల్సిన పనులపై వివరించారు. మొదటి విడుత మన ఊరు-మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో నిరంతరం నీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ సరఫరా, పాఠశాలల మరమ్మతులు, రంగులు వేయడం, గదుల నిర్మాణం, వంట గదులు, భోజనశాల, డిజిటల్ సౌకర్యాలను కల్పించాలన్నారు. పాఠశాలలో సమావేశాలను నిర్వహించి, ప్రాధాన్యత క్రమంలో పనులను గుర్తించి, వాటిని పరిష్కరించే విధంగా చూడాలన్నారు.
54 ప్రభుత్వ పాఠశాలలకు 18బడులు ఎంపిక
రామాయంపేట : మన ఊరు మనబడికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తమ పాఠశాలల నివేదికను వెంటనే సమర్పించాలని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఎంపీడీవో యాదగిరి రెడ్డి, ఎంఈవో గంగాబాయి పేర్కొన్నారు. శనివారం రామాయంపేట మండల కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రామాయంపేట మండల వ్యాప్తంగా ఎంపికైన పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. రామాయంపేట మండల వ్యాప్తంగా 54 ప్రభుత్వ బడులకు గాను మున్సిపల్లో 5 పాఠశాలలు ఎంపిక కాగా మండలంలోని 8 ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రాథమికొన్నత పాఠశాలలు, 3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మన ఊరు, మన బడికి ఎంపికైనట్లు తెలిపారు.
నిజాంపేటలో..
నిజాంపేట : ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ చేకూరుతుందని ఎంఈవో గంగాబాయి అన్నారు. శనివారం నిజాంపేటలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈవో పాల్గొని మాట్లాడారు. నిజాంపేట మండలంలోని 10 పాఠశాలలు మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఎంపికైనట్లుగా తెలిపారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయల జాబితాను ఓ ఫార్మట్లో నింపి జిల్లా అధికారులకు పంపించాలని సూచించారు.
మన ఊరు-మనబడి కార్యక్రమంపై అవగాహన
శివ్వంపేట : ప్రభుత్వ ఆదేశానుసారం మన ఊరు- మనబడి కార్యక్రమంపై శివ్వంపేట మండలంలోని ప్రధానోపాధ్యాయులకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈవో బుచ్యానాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో బుచ్యానాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ విద్యను అందించడం జరుగుతుందని, అదే విధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి రూపురేఖలు మార్చడం జరుగుతుందని తెలిపారు.
చేగుంటలో..
చేగుంట : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ పేర్కొన్నారు. చేగుంటలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం మొదటి విడుత సమావేశం నిర్వహించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
నర్సపూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాధికారి బుచ్చానాయక్ పిలుపునిచ్చారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈవో బుచ్చానాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈవో బుచ్చానాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో నిర్వాహణ కమిటీని నియమించుకోవాలని వెల్లడించారు. పాఠశాలలో కావాలసిన వసతులను గుర్తించి ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో మార్టిన్ లూథర్, పంచాయతీరాజ్ ఏఈ స్వామిదాస్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.