మెదక్/సంగారెడ్డి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): జన హృదయనేత, తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ను తమ గుండెల్లో నిలుపుకొని ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెన్నంటే నిలిచి ఆయనతో అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా బుధవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. దీన్ని పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా పేల్చారు. జై కేసీఆర్.. జై జై కేసీఆర్.. జై భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో నాయకులు స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. తూప్రాన్, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి, శివ్వంపేట, మనోహరాబాద్, చేగుంట, రామాయంపేట, హవేళీఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, నిజాంపేట మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు.
వెల్లువెత్తిన అభిమానం
తెలంగాణ సాధణ కోసం సీఎం కె.చంద్రశేఖర్రావు ఏప్రిల్, 2001లో టీఆర్ఎస్ స్థాపించారు. అప్పడు సీఎం కేసీఆర్కు సంగారెడ్డి, మెదక్ ప్రాంత ప్రజలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు అన్ని వర్గాల వారు అండగా నిలిచి ఆయనతో కలిసి ఉద్యమంలో పాలుపంచుకున్నారు. వేర్వేరు రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరి తెలంగాణ సాధన కోసం పోరాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించడం ఖాయమని నమ్మి ఆయన వెంటే నడిచారు. 2014 జూన్ 2న తెలంగాణ కల సాకారమైంది.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటనపై సర్వత్రా హర్షం
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఆహ్వానిస్తున్నారు. సీఎం కేసీఆర్ విజయదశమి రోజున టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, బంగారు తెలంగాణాగా అభివృద్ధి చేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి విజయం సాధించడం ఖాయమని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం వెనకబాటుకు గురవడంతో పాటు ప్రజా సంక్షేమం కొరవడుతునదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. బీజేపీ పాలనలో దేశంలో మత రాజకీయాలు పెరగడంతో పాటు దేశ ప్రతిష్ట దిగజారుతున్నదన్న భావన ఉంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో మార్పు రావడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ దశదిశా మారడం ఖాయమని చెబుతున్నారు.
అంబరాన్నంటిన సంబురాలు
తెలంగాణ ప్రజలు ఆనందంగా జరుపుకొనే దసరా నాడు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటించడంపై అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. మిఠాయిలు పంచిపెడుతూ జరుపుకొన్న సంబురాలు అంబరాన్నంటాయి. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ ప్రకటనపై హర్షం వ్యక్తంచేశారు. సదాశివపేట, పటాన్చెరు, ఇస్నాపూర్, జిన్నారం, అందోలు, జోగిపేట, వట్పల్లి, పుల్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్లో పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టి సంబురాలు జరుపుకొన్నారు.
జయహో…కేసీఆర్
సీఎం కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మిష న్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మితో పాటు దళిత బంధు, ఆసరా పింఛన్లు, ప్రాజెక్టుల నిర్మాణాలు ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే. 75 ఏండ్ల స్వాతంత్య్ర పాలనలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయాయి తప్ప ప్రజలకు ఎలాంటి పథకాలు అందలేదు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఇందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేశారు.
– పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్
కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి
రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరితే, అధికారంలో ఉన్న బీజేపీ రైతులపై దాడి చేసింది. అదే సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం కృషి చేశారు. సీఎం కేసీఆర్ దళితుల కోసం దళిత బంధు పథకం అమలుచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ పార్టీ బీఆర్ఎస్తో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుంది. కుల, మాతం భేదాలు లేకుండా దేశంలో అన్ని వర్గాలకు మేలు చేసే పథకాలు అమలుచేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నాం.
– కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
ఓ ఆశయంతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు
దేశాన్ని బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ ఓ ఆశయంతో ముందుకువెళ్తున్నారు. దేశాభివృద్ధిలో మనమెందుకు భాగస్వాములం కాకూడదని ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితిని ఆవిర్భవించింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశమంతటా జరగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. బీఆర్ఎస్ను ఏర్పాటు చేస్తు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతిస్తుండ్రు.బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్న.
– వెన్నవరం భూపాల్రెడ్డి,
ప్రొటెం మాజీ చైర్మన్. ఆర్సీపురం
రాష్ర్టాల హక్కులు హరించడం దుర్మార్గం
రాష్ర్టాల హక్కులను కేంద్రం హరించడం హేయమైన చర్య. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. విద్యుత్ను బడాబాబుల కంపెనీలకు అప్పజెప్పేందుకు కుట్రలు చేస్తున్నది. అన్ని వర్గాల సంక్షేమానికి కొత్త పథకాలు తీసుకొచ్చి పాలన అందించేందుకు జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు వచ్చారు. కోటి ఎకరాల మాగాణికి సాగునీళ్లేంచేందుకు ప్రాజెక్టులు కట్టడం తప్పా.
– పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్