ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దూలగుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన.. అంటూ ఆడబిడ్డలు పూల పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా మహిళలు కోలాటాలు, బొడ్డెమ్మలు వేశారు. సాయంత్రం వేళ విద్యుద్దీపాల వెలుగుల్లో అంతా ఒక్కచోటకు చేరి ఆడడంతో పూలజాతరను తలపించింది. చెరువులు, కుం టల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం ఒకరికొకరు వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు.
గునుగు పూల జాతర అంబరాన్నంటింది. అమ్మలక్కలంతా ప్రకృతి నుంచి పుట్టిన బతుకమ్మను వివిధ రకాల పూలతో సింగారించి వాకిళ్లలో ఉంచి బతుకమ్మ ఆటలు ఆడిపాడారు. అనంతరం గంగమ్మ ఒడికి చేర్చి పోయిరా బతుకమ్మ., వెళ్లిరా గౌరమ్మ.. అంటూ మొక్కుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సోమవారం చివరి రోజైన సద్దుల బతుకమ్మ వేడుకను మెతుకుసీమ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకొన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణాలు, పల్లెలు పూల సింగిడిని తలపించాయి. పలుచోట్ల జరిగిన ఈ సంబురాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణం, కోమటి చెరువు వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీశ్రావు-శ్రీనిత దంపతులు పాల్గొన్నారు.