మెదక్, (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 3: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టరేట్లలో సద్దుల బతుకమ్మ సంబురాలు డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళలు సద్దుల బతుకమ్మను పేర్చి ఆట పాటలతో సందడి చేశారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ తెలంగాణలో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకొనే పండగ బతుకమ్మ అని అన్నారు.
పూలతో బతుకమ్మను పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆనందోత్సాహాలతో మహిళలు ప్రత్యేక సంబురాలు నిర్వహిస్తారని గుర్తుచేశారు. గౌరీదేవి దీవెనలు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. 9 రకాల నైవేద్యాలు సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రమేశ్ కుమార్, జిల్లా పరిశ్రమల మేనేజర్ కృష్ణ మూర్తి, సంగారెడ్డిలో జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, డీఆర్డీవో శ్రీనివాసరావు, బతుకమ్మ సమన్వయాధికారి రాజిరెడ్డి, అడిషనల్ డీఆర్డీవో భీమయ్య, ఉద్యోగులు, ఆయా శాఖల మహిళా అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.