మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 18: జనుము సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మెదక్ జిల్లా సహాయ వ్యవసాయాధికారి నిర్మలకు జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి సూచించారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో 3వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, పశుపోషణ, పాడి పరిశ్రమ అభివృద్ధి, అటవీశాఖ, మార్కెటింగ్, పౌర సరఫరా తదితర శాఖల అధికారులు వారి వారి నివేదికలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా లావణ్యరెడ్డి మాట్లాడుతూ వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కలిగించాలని సూచించారు. ఇందులో భాగంగా చాలామంది రైతులు జనుము పంటను సాగు చేశారన్నారు. సరైన సాగు విధానం తెలియక వరి లాగే జనుములో నీరు నిల్వ ఉంచడంతో పంట దెబ్బ తిన్నదన్నారు. వ్యవసాయధికారులు ఇతర పంటలపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర పంటల కోసం సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నా, రైతులకు అందడం లేదని జడ్పీటీసీ రమేశ్గౌడ్ అన్నారు. వేరుశనగ విత్తనాల కోసం రైతులు మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లాల్సి వస్తున్నదన్నారు. లిక్విడ్ యూరియా మన జిల్లాకు ఇంత వరకు రాలేదని, తొందరగా తెప్పించాలని కోరారు. జిల్లాలో బీమా పరిహారం కింద 70 మంది పాడి రైతులకు రూ.49 లక్షలతో పాడి పశులు ఇప్పించినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి విజయశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాలో 1,72,345 పశువులకు గాలికుంట వ్యాధి టీకాలు, 1,90,837 గొర్రెలు, మేకలకు నల్లమబ్బు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలోకి వెళ్లి వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షల మొక్కలు
హరితహారం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచినట్లు జిల్లా అటవీశాఖ అధికారి రవికుమార్ చెప్పారు. జిల్లాలో 10 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. హవేలీ ఘనపూర్ మండలంలో అటవీ ప్రాంతాల్లోని పంటను తీసుకురావడానికి రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని రవికుమార్కు సూచించారు. సుల్తాన్పూర్ వద్ద పట్టా గల అసైన్డ్ భూముల్లో కోళ్ల ఫారాల కోసం రైతులు షెడ్లు వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని లావణ్యరెడ్డి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో జడ్పీ సీఈవో శైలేశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి మహమ్మద్ షరీఫ్, పౌర సరఫరా అధికారి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.