మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 2: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకొనే బతుకమ్మ పండుగను దుబ్బాక నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం సద్దుల బతుకమ్మ పం డుగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా మాదిరిగానే ఈ సంవత్సరం ముందస్తుగా పల్లెల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. సద్దుల బతుకమ్మను సంబురంగా జరుపుకొనేందుకు గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, చెరువు కట్టలను శుభ్రం చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రధాన కూడళ్ల వద్ద చదును చేసి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. చెరువు కట్టలపై ముళ్లపొదలు, చెత్తాచెదారం తొలిగించి విద్యుత్ దీపాలతో అలంకరించారు. చెరువుల వద్ద దొంగతనాలు జరుగకుండా పోలీసు బందోబస్తుతో పాటు చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదాలు జరుగకుండా వలలు, జాలర్లను ఏర్పాటు చేశారు. సెలవులు రావడంతో గ్రామాల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను సంతోషంగా జరుపుకొనేందుకు పట్టణాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో పల్లెలకు తరలివచ్చారు.
ప్రకృతి దేవత..బతుకమ్మ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల అమావాస్య నుంచి తొమ్మిది రోజులు ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మ ఆడి నేడు సద్దుల బతుకమ్మ గొప్పగా చేసుకుంటామని చెప్పారు. దేశంలో పూలతో చేసుకునే ప్రకృతి దేవతగా ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేశామన్నారు. బతుకమ్మ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
చెరువుల పరిశీలన
మెదక్లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కమిషనర్ శ్రీహరితో కలిసి చెరువులను పరిశీలించారు. పట్టణంలోని పలు కూడళ్ల వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మెదక్ మార్కెట్, జేఎన్రోడ్డులలో సద్దుల బతుకమ్మ సందర్భంగా పూల అమ్మకం కొనుగోలు దారులతో సందడి నెలకొన్నది.
బొటనవేలిపై ‘సద్దుల’ శుభాకాంక్షలు
పెద్దశంకరంపేట,అక్బోబర్ 2 : చేతి బొటన వేలిపై సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ సూక్ష్మ రూపంలో సద్దుల బతుకమ్మ, గౌరమ్మలు తయారు చేసి అబ్బురపర్చాడు పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన స్వర్ణకారుడు శ్రీనివాసచారి. సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ పురస్కరించుకొని బొటన వేలిపై రంగు,రంగుల పూలతో చిన్న బతుకమ్మ తయారు చేయడం పలువురిని ఆకట్టుకున్నది.
కాగితం పూల బతుకమ్మలకు భలే డిమాండ్
అందోల్, అక్టోబర్ 2: బతుకమ్మ పండుగకు తీవ్రంగా పువ్వుల కొరత ఏర్పడడంతో దీన్ని దృష్టిలో పెట్టుకొని పలువురు వ్యాపారులు కాగితం బతుకమ్మలను తయారు చేస్తు జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు. అందోల్-జోగిపేట పట్టణాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లో వివిధ ప్రాంతాలనుంచి కాగి తం బతుకమ్మలను తీసుకు వచ్చి విక్రయిస్తున్నారు. మహిళలు సైతం పూల కొరతతో కాగితం బతుకమ్మలవైపు మొగ్గు చూపుతుండడంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. కాగితం బతుక మ్మలు రూ.100 మొదలుకొని రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి బతుకమ్మలకు మంచి గిరాకీ ఉందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.