వెల్దుర్తి, ఆక్టోబర్ 1: రోడ్డు వెడల్పుతో వెల్దుర్తి మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. రూ. 8 లక్షలతో బస్టాండ్ చౌరస్తా నుంచి కుడి చెరువు వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం ప్రధాన రహదారులకు వెలుపలికి ఉండడం, చుట్టుపక్కల గ్రామాలు అధికంగా ఉండడంతో పట్టణంలో మంచి మార్కెట్ ఉంటుందన్నారు. సరైన రోడ్లు, రవాణా వ్యవస్థ లేక ఇబ్బందులు పడేవారన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ హామీ మేరకు పట్టణ రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న ఇండ్లు, దుకాణాలను పెద్ద ఎత్తున తొలిగించి, రోడ్డు వెడల్పు చేశామన్నారు. నర్సాపూర్ నుంచి వెల్దుర్తి మీదుగా తూప్రాన్ వరకు రెండు లేన్ల రోడ్డు నిర్మించడంతో రవాణా వ్యవస్థ పెరిగి, భూముల ధరలు రెండింతలు పెరిగాయన్నారు. దీంతో పట్టణం వ్యాపార అడ్డాగా మారిందన్నారు. అనంతరం దుర్గాభవాని సేవా సమితి ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను దుర్గాభవానీ సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. శేరీల గ్రామంలో మల్లన్న ఆలయ నిర్మాణానికి నిధులు, గ్రామానికి రోడ్డు వేయించాలని గ్రామస్తులు కోరగా స్పందించిన ఎమ్మెల్యే ఆలయ నిర్మాణం కోసం రూ.20 లక్షలు, రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, ఇండ్లు లేని వారికి రెండు పడక గదుల ఇండ్లను మంజూరు చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ రమేశ్గౌడ్, సర్పంచ్ భాగ్యమ్మ ఆంజనేయులు, ఎంపీటీసీ మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్రెడ్డి, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, నాయకులు ఆంజనేయులు, నరేందర్రెడ్డి, అశోక్గౌడ్, గంగాధర్, శాఖారంశ్రీను, వెంకటేశం, శ్రవణ్ పాల్గొన్నారు.