హవేళీఘనపూర్, సెప్టెంబర్ 30ః దొంగతనాలకు పాల్పడుతూ తమ పరువు తీస్తున్నాడనే కోపంతో ఓ తల్లి, చిన్న కుమారుడు కలిసి పెద్ద కుమారుడిని ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసులో తల్లీ కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి తెలిపారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం నాగాపూర్కు చెందిన సంగయ్య మొదటి కుమారుడు చింతకింది దేవేందర్(27). కాగా, దేవేందర్ చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతూ గ్రామంలో తమ పరువు తీస్తున్నాడని, ఎలాగైనా హత్య చేయాలని అతడి తల్లి భూమవ్వ, చిన్న కుమారుడు కృష్ణలు గత నెల 17న నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో 18న వీరిద్దరూ కలిసి దేవేందర్ను హత్య చేసి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడంతో పాటు అదే రోజు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడి జరిమానా విధించి విషయం బయటకు పొక్కకుండా మృతదేహాన్ని ఖననం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైందన్నారు.
అనంతరం కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు 26వ తేదీన పోలీసుల దృష్టికి రావడంతో మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో విచారణ చేపట్టి దేవేందర్ను తల్లి భూమవ్వ, చిన్న కుమారుడు కృష్ణలు హత్య చేసినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయం బయటకు రాకుండా గ్రామంలోనే పంచాయతీ నిర్వహించిన ఇద్దరు గ్రామ పెద్దలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ సహజ మరణం అయితే తప్ప పోలీసుల దృష్టికి తేకుండా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని ఇష్టారీతిగా వ్యవహరించినా తీర్పులిచ్చి జరిమానాలు విధించినా చట్టవిరుద్ధమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైన అయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బాలస్వామి, డీఎస్పీ సైదులు, మెదక్ రూరల్ సీఐ విజయ్, మోహన్రెడ్డి, మురళి తదితరులు ఉన్నారు.