న్యాల్కల్, ఫిబ్రవరి 14 : సర్కారు బడుల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సర్కారు నిర్ణయంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదేండ్ల నుంచి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తూ ఆదర్శ పాఠశాలగా నిలుస్తున్నది. పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసి, చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు దాతలు, టీచర్లు సమష్టిగా కృషి చేస్తున్నారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులతో తరగతి గదుల్లో విద్యార్థులను ఆకర్షించేలా బొమ్మలతో పాటు పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలను తీర్చిదిద్దారు. పలువురు దాతలు డిజిటల్ తరగతుల కోసం ప్రొజెక్టర్ స్క్రీన్, కంప్యూటర్. డెస్క్ బెంచీలు, అల్మారా, నోటు పుస్తకాలను అందజేశారు. హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పాఠశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, డ్రెస్లు పంపిణీ, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తూ, సకల సౌకర్యాలు కల్పించి అర్హత కలిగిన టీచర్లతో బోధన చేస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుంచి తీసి మామిడ్గి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. గతేడాది ఇక్కడ 159 మంది విద్యార్థులుండగా, ఈసారి ఆ సంఖ్య 215కు చేరింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ తో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాల విద్యార్థులకు సర్కారు బడి ఒక వరంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.
అందరి సహకారంతో…
అందరి సహాయ సహకారాలతో పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తున్నాం. దీంతో చాలామంది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రాథమిక పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతో మంది విద్యార్ధులకు చాలా మేలు జరుగుతుంది.
– బ్రహ్మయ్య, హెచ్ఎం, మామిడ్గి పాఠశాల
ప్రభుత్వ బడులకు మహర్దశ..
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఆంగ్ల మధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించినైట్లెతే ఎంతో మేలు జరుగుతుంది. దీంతో భవిష్యత్తులో వారికి అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
– చంద్రన్న, గ్రామ సర్పంచ్, మామిడ్గి
టీచర్లు అర్థమయ్యేలా బోధిస్తున్నారు..
పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆంగ్లంలోనే పాఠాలను మాకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ప్రైవేట్కు దీటుగా అన్ని సౌకర్యాలను కల్పించి, తరగతి గోడలపై వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలు గీయించారు. డిజిటల్ పద్ధతిలో చక్కగా చదువులు చెబుతున్నా రు. ఇంగ్లిష్ బోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
– స్నేహ, విద్యార్థి, మామిడ్గి పాఠశాల