ప్రజా సంక్షేమం కోసం ఉచిత పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా.. వాటిని నిలిపివేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంతో పాటు మొగుడంపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చేసిందని తెలిపారు. గతంలో తెలంగాణలో 91 గిరిజన గురుకుల పాఠశాలలుండగా, నేడు 180కి చేరయన్నారు. పావలావడ్డీ రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలతో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదల కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం కేసీఆర్ను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. త్వరలో జహీరాబాద్లో 50 పడుకల మాతాశిశు సంరక్షణ కేంద్రం, పాతబస్తీలో మరో బస్తీ దవాఖాన, కోహీర్లో 50 పడకల దవాఖానను నిర్మిస్తామని తెలిపారు.
జహీరాబాద్, సెప్టెంబర్ 24 : ఉచిత పథకాలు నిలిపి వేసే డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కార్ కావాలా..ప్రజల సంక్షేమానికి ఉచిత పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా తేల్చుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు ప్రజలను పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం, మొగుడంపల్లి మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించి ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన ప్రసంగిచారు. మొగుడంపల్లికి పక్కనే ఉన్న కర్ణాటకలోని చించొళిలో బీజేపీ ప్రభుత్వం ఉందని,అక్కడ ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ పథకాలు ఉన్నాయా అని ప్రజలను ప్రశ్నించగా, అక్కడ ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని ప్రజలు సమాధానం చెప్పారు. చించొళి, బొంగుర్, కరుకనెల్లిలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. పేదల కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాలు కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి…
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మహిళలకు తాగునీటి కష్టాలు లేకుండ ప్రతి ఇంటికీ మిషన్ భగరీథ నీరు సరఫరా చేస్తున్నామని మంత్రి హరీశ్రావు అన్నారు. పక్కన ఉన్న కర్ణాటకలో మిషన్ భగీరథ నీరు వస్తుందో లేదో తెలుసుకోవాలన్నారు. గతంలో బిందెడు తాగునీటి కోసం మ హిళలు వ్యవసాయ బావుల, బోర్ల వద్దకు వెళ్లే వారన్నారు. రాష్ట్రంలో మహిళలకు తాగునీటి కష్టాలు లేకుండా సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానల్లో సౌకర్యాలు కలిపించినట్లు తెలిపారు. సాధారణ కాన్పులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. కర్ణాటకలో పింఛన్లు రూ. 600 ఉంటే, తెలంగాణలో రూ. 2000 ఇస్తున్నట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న ఎందుకు వ్యవసాయనికి కరెంట్, తాగునీరు సరఫరా చేయలేదన్నారు.
గీతారెడ్డి సమస్యలెందుకు పరిష్కరించలేదు..
జహీరాబాద్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గీతారెడ్డి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని మంత్రి హరీశ్రావు ప్రశ్నంచారు. రాష్ట్ర మంత్రిగా ఉండి జహీరాబాద్ సర్కార్ దవాఖానను ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో మహిళలు తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పని చేస్తున్నదని, ఎన్నికల కోసం వచ్చే వారిని నమ్మరాదని ప్రజలకు మంత్రి సూచించారు.
వ్యవసాయ అధికారులపై మంత్రి ఆగ్రహం…
మన్నాపూర్ రైతు వేదిక ప్రారంభించి రైతువేదికలో మంత్రి హరీశ్రావు పంట ల సాగు వివరాలు ఆరాతీశారు. పంటల సాగు గురించి సరైన వివరాలు చెప్పనందుకు ఏడీఏ భిక్షపతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని కలెక్టర్ శరత్ దృష్టికి మంత్రి తీసుకెళ్లా రు. బిందుసేద్యం పరికరాలు మంజూరు చేయాలని రైతులు మంత్రిని కోరగా, మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అధికారులు పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
మంత్రి హరీశ్రావు పర్యటన సక్సెస్..
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పర్యటన జహీరాబాద్, మొగుడంపల్లిలో విజయవంత కావడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. శనివారం జహీరాబాద్తో పాటు మొగుడంపల్లి మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు,జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్, అడిషనర్ కలెక్టరులు రాజార్షి షా, వీరారెడ్డి పాల్గొన్నారు. పస్తాపూర్లో మైనార్టీ ఉర్దూ మీడియం కళాశాల భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. మొగుడంపల్లి మండలం మన్నాపూర్లో రైతు వేదిక ప్రారంభించారు. మొగుడంపల్లిలో సీసీ రోడ్లు, డివైడరు, అంబేదర్ భవనం, ‘మనఊరు-మనబడి’ పథకం పనులు ప్రారంభించారు. మొగుడంపల్లిలో కొత్తగా నిర్మించిన గిరిజన బాలికల గురుకు ల పాఠశాల, కళాశాల భవనాన్ని ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు.
జహీరాబాద్లోని హమా లీ కాలనీలో బస్తీ దవాఖాన, పట్టణ క్రీడా మైదానం, మిషన్ భగీరథ ట్యాంకు ను ప్రారంభించారు. పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. సర్కారు దవాఖానలో మాతా శిశు సంక్షేమ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విశ్రాంతి ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మొగుడంపల్లి గ్రామ అభివృద్ధికి రూ. కోటి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ డైరెక్టర్ శ్రీనివాస్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా వైద్య అధికారి గాయత్రిదేవి, డీసీహెచ్వో సంగారెడ్డి, ఆర్డీవో రమేశ్బాబు, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాం త్ పాటిల్, ఆత్మ చైర్మన్ పెంటారెడ్డి, మొగుడంపల్లి జడ్పీటీసీ అరుణమోహన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎంజీ రాములు, శ్రీనివాస్రెడ్డి, విజయ్మోహన్రెడ్డి, మొయినొద్దీన్, మొగుడంపల్లి సర్పంచ్ సుగుణమ్మ, తహసీల్దార్లు నా గేశ్వర్రావు, ప్రేమ్కుమార్, మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు , అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గురుకులాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య
తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చేసిందని మంత్రి హరీశ్రా వు అన్నారు. మొగుడంపల్లిలో రూ. 4.50కోట్లతో గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాల భవనం నిర్మాణం చేశామన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో తెలంగాణలో 91గిరిజన గురుకుల పాఠశాలలు ఉండగా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 180 ఏర్పాటు చేసిందన్నారు. గిరిజన బాలికలు పదో తరగతి వరకు చదువుకొని మధ్యలో చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో ఇంటరు, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 20 గిరిజన డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి మ హిళలకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులకు పీజీ, లా చదువుకొనేందుకు కొత్తగా కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గతంలో తెలంగాణలో గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 1.12 లక్షల మంది చదవగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విద్యార్థుల సంఖ్య 4.50 లక్షలకు పెరిగినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు.
జహీరాబాద్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు
జహీరాబాద్లో ఉన్న వంద పడకల దవాఖానతో పాటు ఆదనంగా 50 పడుకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని రూ. 7.50 కోట్లతో నిర్మించి 39 మంది వైద్యులు, నర్సులను నియమిస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇది 8నెలల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జహీరాబాద్లోని హమాలీ కాలనీలో కొత్తగా బస్తీ దవాఖాన ఏర్పాటు చేసిన బస్తీ వాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. జహీరాబాద్ పాత పట్టణంలో మరో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. కోహీర్లో 50 పడకల దవాఖాన నిర్మాణం చేస్తున్నామని, అక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
ప్రశ్నలడిగి జవాబులు ఆరాతీసి..
మంత్రి : తెలంగాణ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది..?
విద్యార్థినులు : 2014 జూన్ 2సారు
మంత్రి : తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి..?
విద్యార్థినులు : 33 జిల్లాలు ఉన్నాయి సారు
మంత్రి : తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్ల పెండ్లికి ఎంత సాయం
అందిస్తున్నది. ఈ పథకం పేరు ఏమిటి.?
విద్యార్థినులు : కల్యాణలక్ష్మి, షాదీముబారక్
మంత్రి : రైతులకు పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం
ఇస్తున్న పథకం పేరు..?
విద్యార్థినులు : రైతుబంధు పథకం సార్
మంత్రి : ప్రపంచంలో ఎక్కడా జరగని పండుగ తెలంగాణలో
జరుగుతుంది.ఆ పండుగ పేరు..?
విద్యార్థినులు : బతుకమ్మ పండుగ సార్
మంత్రి : గిరిజనులను దేవుడు ఎవరు..?
విద్యార్థినులు : సేవాలాల్ మహారాజ్ సార్
మంత్రి : జహీరాబాద్ ఎమ్మెల్యే ఎవరు..?
విద్యార్థినులు : ఎమ్మెల్యే మాణిక్రావు సార్
మంత్రి : మీ జిల్లా పేరు..?
విద్యార్థినులు : సంగారెడ్డి జిల్లా సార్..
మంత్రి : మంజీరా నదిపై ఉన్న ప్రాజెక్టు పేరు..?
విద్యార్థిని రాధ : సింగూర్ ప్రాజెక్టు సార్
మంజీరా నదిపై ఉన్న ప్రాజెక్టు పేరు చెప్పిన విద్యార్థినికి మంత్రి
హరీశ్రావు రూ.1000 నగదు బహుమతి అందజేశారు.
నియోజవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఎంతో కృషి చేస్తున్నారు. జహీరాబాద్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 50కోట్లు మంజూరు చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి పంచాయతీకి రూ. 20 లక్షలు మంజూరు చేశారు. గిరిజనులకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు, రోడ్లు, భవనలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. జహీరాబాద్ పట్టణంలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ దవాఖానలో మెరుగైన సౌకర్యాలు కలిపించడం సంతోషంగా ఉంది.
– కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
సర్కార్ బడిలో చదువుకొని కలెక్టర్ అయ్యాను..
నేను సర్కారు బడిలో చదువుకొని కలెక్టర్ అయ్యాను. అప్పుడు మా తండా నుంచి ఐదు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లేవారం. హైదరాబాద్లో డిగ్రీ చదువుకున్న. మొగుడంపల్లిలో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. విద్యార్థులు కషపడి చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలి.విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టి చదువుకోవాలి. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలో విద్యాబోధన అందుతున్నది. మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సంగారెడ్డిలో ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేసింది.
– సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగమేశ్వర్ ఎత్తిపోతలతో వ్యవసాయనికి సాగునీరు
జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరానికి సాగు నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసింది. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా వ్యవసాయనికి సాగునీరు సరఫరా కానుం ది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోంది. హైదరాబాద్లో బంజారుల సంక్షేమం కోసం సేవాలాల్ మహారాజ్ భవనం నిర్మాణం చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. మొగుడంపల్లి మండలాన్ని మంత్రి హరీశ్రావు కృషితో ఏర్పాటు చేశారు.
– బీబీ పాటిల్, ఎంపీ, జహీరాబాద్
విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి
గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలి. విద్యార్థుల భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలు పని చేస్తున్నాయి. గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావడం సంతోషంగా ఉంది. మొగుడంపల్లి మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా.
– మంజుశ్రీ, జడ్పీ చైర్పర్సన్ సంగారెడ్డి