కొండపాక, ఫిబ్రవరి 13 : విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్.. విద్య యశస్సు.. భోగకరి, విద్య గురుండు.. విదేశ బంధుడన్ అని సుభాషిత రత్నావళిలో ఏనుగు లక్ష్మణ కవి చెప్పినట్లు చదువుకు ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకున్న కుకునూరుపల్లి ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి తనకు చదువు చెప్పిన బడిని బాగు చేయాలని సంకల్పించుకున్నాడు. అన్నీ తానై ఊరిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను దత్తత తీసుకొని కార్పొరేట్ బడులకు దీటుగా తీర్చిదిద్దాడు. కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామానికి చెందిన పొల్కంపల్లి నరేందర్ లక్షలాది రూపాయలను వెచ్చించి ప్రభు త్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. అందరికీ విద్యాబుద్ధులు అందించే బడిని బాగు చేసిండు. పేద, మధ్యతరగతి విద్యార్థులే ఎక్కువగా ఉండే ప్రభుత్వ పాఠశాలల కోసం తన సొంత డబ్బులు ఖర్చు చేసి ఆధునిక హంగులతో సౌకర్యాలను సమకూర్చిండు. అక్షర జ్ఞానాన్ని అందజేసిన బడికి అం డగా నిలిచి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో పాఠశాల అభివృద్ధి కోసం రూ.5 లక్షలతో బడిని బాగు చేశాడు. సర్కారు బడిలో చదువుకునే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో తనవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నాడు.
సమకూరిన వసతులు
బడిని బాగు చేయాలని.. కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాలలను దత్తత తీసుకున్న పొల్కంపల్లి నరేందర్ పాఠశాలకు కార్పొరేట్ స్థాయి హంగులను తీసుకువచ్చాడు. పాఠశాలకు రంగులు వేయించాడు. విద్యార్థులు చదువుకునే తరగతి గదులకు రామానుజన్హౌస్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య హౌస్, సుభాష్చంద్రబోస్ హౌస్, సీవీ రామన్ హౌస్, ఏపీజే అబ్దుల్కలాం హౌస్ అని పేరు పెట్టారు. విద్యార్థులు వారి జీవితాల నుంచి స్ఫూర్తిని పొందేలా తయారు చేశారు. పాఠశాల గోడలే విజ్ఞానాన్ని అందించేలా విభిన్న రంగులతో అనేక రకాల సమాచారాన్ని బొమ్మల రూపంలో వేయించారు. జాతీయ చిహ్నాలు, ట్రాఫిక్ రూల్స్, భారతదేశం, తెలంగాణ భౌగోళిక చిత్రపటాలు, నీటి పొదుపు, దిక్కులు, స్వచ్ఛభారత్, మానవ శరీర నిర్మాణం, స్థాన విలువలు, వృత్తులు, మంచి అలవాట్లు, హరితహారం, క్యారెక్టర్ ఎడ్యుకేషన్తో పాటు అనేక రకాల అందమైన కార్టూన్ బొమ్మలను గోడలపై వేయించారు. పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడేలా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. పిల్లల్లో దాగి ఉన్న కళా నైఫుణ్యం వెలికి తీసేందుకు వేదికను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కదలికలను కనిపెట్టేలా వారి భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాల రూపురేఖల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్పై పరిజ్ఞానం అందించాలనే లక్ష్యంతో డిజిటల్ క్లాస్ రూం, కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి గదిని ఇంటీరియర్ డెకరేషన్తో ప్రత్యేకంగా ముస్తాబు చేయించారు. ఆంగ్ల విద్యలో విద్యార్థులు పట్టుసాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఆట వస్తువులు, ఆర్థిక సాయం అందజేశారు. పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం పేరిట ప్రోత్సాహకాలను అందజేశారు. ఇలా పొల్కంపల్లి నరేందర్ ప్రభుత్వ పాఠశాల పటిష్టతకు కృషి చేయడంతో నేడు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సంకల్పించున్నారు. దీనికి తోడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను అందించనున్న నేపథ్యంలో కుకునూరుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం సంతరించుకుంది.
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు కృషి
ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలిచి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో గ్రామంలోని ప్రభుత్వ బడికి సౌకర్యాలను సమకూర్చుతున్నా. భర్త పొల్కంపల్లి నరేందర్ బడులను బాగు చేసే దిశగా చేస్తున్న కృషికి నావంతు సహకారం అందిస్తున్న. మా ఊరిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొత్త శోభను సంతరించుకున్నాయి. దీనికి సీఎం కేసీఆర్ చేపట్టిన ఆంగ్ల విద్య తోడైతే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు గొప్ప అవకాశం అందించినట్లు అవుతుంది.
-పొల్కంపల్లి జయంతీనరేందర్, సర్పంచ్, కుకునూరుపల్లి
బడిని బాగు చేయడమే నా లక్ష్యం
చదువుకున్న బడికి నా వంతు సహాయంగా సౌకర్యాలు సమకూర్చి నేటి తరం విద్యార్థులకు మేలు చేకూర్చాలన్నదే లక్ష్యం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసి విద్యార్థులకు మంచి విద్యనందించే దిశగా పని చేస్తున్నా. నా సంకల్పానికి విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయ బృం దం, గ్రామస్తులు, యువకులు అండగా ఉంటున్నారు. భవిష్యత్లోనూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పాటుపడుతా. సీఎం కేసీఆర్ చేపట్టిన నూతన ఆంగ్ల విద్యావిధానం ఎంతో మంది పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ను అందించేలా ఉంది. సీఎం కేసీఆర్ ఆశయ సాధనలో భాగంగా గ్రామంలోని పాఠశాలలకు కావాల్సిన ఆంగ్ల విద్యకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేస్తా.
-పొల్కంపల్లి నరేందర్, పూర్వ విద్యార్థి, కుకునూరుపల్లి