సీపీ గెట్లో తులసికి ఫస్ట్ ర్యాంక్
కోహీర్, సెప్టెంబర్21: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత పరీక్షలో దిగ్వాల్ విద్యార్థిని సార తులసి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామానికి చెందిన సార లక్ష్మీ లాలాజీ దంపతుల రెండో కూతురు సార తులసి. దిగ్వాల్లోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి, హైదరాబాద్లోని రావూస్ కళాశాలలో బైపీసీ పూర్తి చేసింది.
జహీరాబాద్లోని ఆచార్య కళాశాలలో డిగ్రీ చదివింది. 2020లో నిర్వహించిన ఎడ్సెట్లో 150కి 110 మార్కులు సాధించి నంబర్వన్గా నిలిచి ప్రతిభను చాటింది. మంగళవారం వెల్లడించిన సీపీ గెట్ ఫలితాల్లో ఎమ్మెస్సీలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె అక్క స్వాతి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ వృక్షశాస్త్రం చదువుతున్నది. ఈ సందర్భంగా తులసిని అధ్యాపకులు, కుటుంబీకులు, మిత్రులు అభినందించి మిఠాయిలు తినిపించారు.