న్యాల్కల్, ఫిబ్రవరి 13: సంవత్సరానికి ఒకసారి జరిగే పశువుల జాతర(సంత)కు వేలాది పశువులను తీసుకురావడంతో ఉర్సు-ఏ-షరీఫ్ పీర్గైబ్ సాహెబ్ దర్గా ప్రాంతం కిక్కిరిసిపోయింది. మండల కేంద్రమైన న్యాల్కల్ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రత్యేక పశువుల సంతకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు పశువులను ప్రత్యేక వాహనాల్లో భారీగా తీసుకువచ్చారు. పశువులను అందంగా అలంకరించి సంతకు తేవడంతో వాటిని కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు దర్గా వద్దకు చేరుకున్నారు. సంతలో దియోనీ, ఒంగోలు, కిల్లరి తదితర జాతులకు చెందిన ఎడ్లు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు సుమారు రూ. 50 వేల నుంచి 3 లక్షల వరకు ధర పలికాయి. రాయికోడ్ హుల్గెరాకు చెందిన ఎడ్లు జతకు రూ. 2 లక్షలు ధర చెప్పగా, రూ.1,75లక్షలకు అడిగినా విక్రయించలేదు. మండలంలోని హద్నూర్ గ్రామానికి చెందిన పల్లె అశోక్కు చెందిన ఎడ్లు జత రూ. లక్ష 80వేలు చెప్పగా, ఝరాసంగం మండలం కుప్పానగర్కు చెందిన రైతు శేఖర్ రూ. లక్ష 60 వేలకు కొనుగోలు చేశాడు. సంతలో పశువులను చూసేందుకు సామాన్య ప్రజలు, రైతులు భారీగా హాజరై ఆసక్తిగా చూశారు. అనంతరం దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా సంతకు తీసుకువచ్చిన పశువుల్లో ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక గ్రామానికి చెందిన దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు తన్వీర్ హైమ్మద్లు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సిద్ధిలింగయ్యస్వామి, వివిధ నాయకులు నర్సింహారెడ్డి, వెంకట్, సర్పంచ్లు మల్లారెడ్డి, అమీర్, శివశంకరయ్య స్వామి ఎస్సై వినయ్కుమార్, జాతర నిర్వాహకులు యూనుస్ఖాన్, మక్సూద్, నర్సింలు, వహబ్ పాల్గొన్నారు.