చేర్యాల, సెప్టెంబర్ 19 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ధర్మకర్తల మండలిని నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం రాత్రి జీవోను విడుదల చేశారు. 14మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో కూడిన ట్రస్టు బోర్డును ఏడాది కాల పరిమితితో నియమించారు. దీంతో మూడు రోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన ట్రస్టు బోర్డు నియామక కాపీ ఫేక్ అని తేలిపోయింది. అందులో ట్రస్టుబోర్డు సభ్యులుగా ఉన్న సభ్యులు, తాజాగా జారీ అయిన జీవోలో లేరు. ఇదిలా ఉండగా, దేవాదాయ శాఖ తాజాగా విడుదల చేసిన జీవోలో తాజా మాజీ చైర్మన్, టీఆర్ఎస్ కొమురవెల్లి మండలాధ్యక్షుడు గీస భిక్షపతి(కొమురవెల్లి)తో పాటు మర్పల్లి శ్రీనివాస్గౌడ్(సిద్దిపేట), నర్ర రఘువీర్రెడ్డి(గౌరాయపల్లి), చెట్కూరి తిరుపతి(వల్లంపట్ల), కసర్ల కనకరాజు(లద్నూరు), జాటోతు స్వప్న(హనుమతండా), ఎర్రోళ్ల మల్లేశం, కందుకూరి సిద్ధిలింగం(చేర్యాల), బోయిన సాయికుమార్(హైదరాబాద్), కొంగరి గిరిధర్(ముస్త్యాల), గడ్డం మహేశ్యాదవ్(హైదరాబాద్), పచ్చిమడ్ల సిద్ధిరాములు(చేర్యాల), నామిరెడ్డి సౌజన్య(కొమురవెల్లి), సూటిపల్లి బుచ్చిరెడ్డి(చుంచనకోట)ను ధర్మకర్తలు, కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్ ఎక్స్ అఫీషియో మెంబర్గా నియమించారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం ట్రస్టుబోర్డు సభ్యులు చైర్మన్ను ఎన్నుకోనున్నారు. తాజా మాజీ చైర్మన్ గీస భిక్షపతి చైర్మన్ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ట్రస్ట్బోర్డును నియమిస్తూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జీవో జారీ చేసినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.