సంగారెడ్డి, సెప్టెంబర్17 : స్వేచ్ఛా స్వాతంత్య్రంతో జీవించడానికి అమరులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో కీలకమైన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజుగా ప్రజలందరికీ గర్వకారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ మైదానంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు హోం మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతకాన్ని ఎగురవేశారు. అంతుకు ముందు పోలీసు వందన స్వీకారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తెలంగాణ అభివృద్ధి సందేశాన్ని ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కొత్త రాష్ట్రం అభివృద్ధ్దిని చూసి ఓర్వలేకనే బీజేపీ లాంటి ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధ్దాంతం చేస్తూ, లబ్ధ్దిపొందే ప్రయత్నం చేస్తూ చతికిల పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆదివాసీ, బంజారా భవన్లు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. ఏటా రైతుబంధు రూ.2,906 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు.
జలకళ
జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.4.427 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. దీంతో జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో బంగారు పంటలు పండుతాయన్నారు. మిషన్ కాకతీయలో 4 విడతల్లో రూ. 240 కోట్ల నిధులు ఖర్చుచేసి చెరువులను పునరుద్ధరించామన్నారు. మిషన్ భగీరథ పథకంతో జిల్లా 943 నివాస ప్రాంతాలకు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మాణాలు చేపట్టి ప్రజలుకు తాగునీరు సరఫరా చేస్తున్నమన్నారు. జిల్లాలోని అన్ని గిరిజన తండాలకు తాగు నీరు అందిస్తూ ఇందు కోసం రూ.1,372 కోట్ల నిధులు ఖర్చుచేశామన్నారు. దళితబంధుతో జిల్లాలో 444 మంది లబ్ధ్దిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కొరికీ రూ. 10 లక్షల చొప్పున రూ. 44.40 కోట్ల ఆర్థిసాయం అందజేశామని వెల్లడించారు. జిల్లా 13 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నమన్నారు. ఈ వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, కలెక్టర్ శరత్ కుమార్ నాయక్, ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, డీఆర్వో రాధిక రమణి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.