సుల్తాపూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల పది వసంతాలు పూర్తి చేసుకున్నది. 2012లో ఈ కళాశాలను స్థాపించారు. కళాశాల విస్తీర్ణం 155 ఎకరాలు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీతో విద్యార్థుల సౌకర్యార్థం అకాడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేషన్, వసతి గృహం, సిబ్బంది నివాస గృహాలు, డిజిటల్ లైబ్రరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, వైద్య చికిత్స కేంద్రం, క్యాంటిన్ ఉన్నాయి. ఇవేకాక 25 ఎకరాల విస్తీర్ణంలో సోలర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ జేఎన్టీయూ కళాశాల చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేస్తూ, వచ్చిన ఆదాయాన్ని కళాశాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు.
– చౌటకూర్, మే27
జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు విభాగాల కోర్సులున్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్, మెకానిక్, సివిల్ ఇంజినీరింగ్ ఉన్నాయి. ప్రతి విభాగంలో 66 మంది విద్యార్థుల చొప్పున ఏటా 264 మంది అడ్మిషన్ పొందుతున్నారు. సుమారు వెయ్యి మందికిపైగా కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో బాలుర వసతి గృహాలు 6, భోజన శాలలు 3, బాలికలకు వసతి గృహాలు 3లు ఉన్నాయి. మొదటి ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపాల్గా జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. కళాశాల ప్రిన్సిపాళ్లుగా ఈశ్వర్ప్రసాద్, బాలునాయక్ విధులు నిర్వహించారు. ప్రస్తుత ప్రిన్సిపాల్గా జీఎన్.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్గా జి.నర్సింహరావు విధులు నిర్వహిస్తున్నారు. బాలుర డిప్యూటీ వార్డెన్ (సీఎస్సీ ప్రొఫెసర్)గా డాక్టర్ బీవీ రామ్నరేశ్ యాదవ్, బాలికల వసతి గృహం డిప్యూటీ వార్డెన్గా ప్రొఫెసర్ శైలజ (మెకానికల్ ప్రొఫెసర్) విధులు నిర్వహిస్తున్నారు.
కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంతో విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచారు. పోటీ పరీక్షలకు చదువుకునేందుకు వీలుగా 17,500 పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్కుమార్ కృషి చేస్తున్నారు.
స్పోర్ట్స్లో సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు ఏటా రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. స్పోర్ట్స్ శిక్షణ అధికారిగా దిలీప్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వి.రజనేశ్ల నేతృత్వంలో విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు.
ఇంజినీరింగ్ చదవిన విద్యార్థులకు బహుళ జాతీయ సంస్థల్లో 300లకు పైగా అవకాశాలు వచ్చాయి. ఇందులో వార్షిక వేతనం గరిష్టంగా రూ9.5 లక్షలు పొందారు. పదుల సంఖ్యలో విద్యార్థులు జాతీయ సంస్థల్లో 2-3 ఉద్యోగాలు అవకాశాలు లభించాయి.
ఎన్ఎస్ఎస్ అధికారులుగా బీవీ.రామ్ నరేశ్ యాదవ్, డాక్టర్ ఎన్ఎస్ దిలీప్ విధులు నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్తో రక్తదానం, కళాశాల సమీప గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ, జాతీయ ఓటరు దినోత్సవం, పవర్ యోగా, తెలంగాణకు హరితహారం, మాస్క్, శానిటైజర్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. యాంటీర్యాగింగ్, యాంటీ డ్రగ్స్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, వివిధ విభాగాల తరుఫున టెక్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లు కళాశాలలో తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి ఏడాది మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కళాశాలకు నిధులు కేటాయించి భవనాలు నిర్మించారు. దీంతో కళాశాల మంచి పేరు, ప్రతిష్ట సంపాదించుకున్నది. సిబ్బంది సహకారంతో కళాశాల అభివృద్ధిలో దూసుకుపోతున్నది. కళాశాల స్థాపించి పదేండ్లు పూర్తైన సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నాం.
– జీఎన్.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ