జహీరాబాద్, ఆగస్టు17: జహీరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళికా ప్రకారం పనులు చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ముస్లిం, మైనార్టీలకు షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
పట్టణంలోని పాత షాదీఖానా స్థానంలో హజ్ హౌస్ నిర్మిస్తామన్నారు. బుర్థిపాడు శివారులో ప్రభుత్వం ముస్లింలకు ఐదెకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. అక్కడ షాదీఖానా నిర్మిస్తామన్నారు. జహీరాబాద్లో సమీకృత కూరగాయల మార్కెట్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ వరకు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ కోరారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, రంజోల్ నుంచి హుగ్గెల్లి తండా వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
కేతకీ సంగమేశ్వరాలయం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు సుముఖంగా ఉందని, వెంటనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దేవాదాయ శాఖ, ఇంజినీరింగ్ అధికారులు దేవాలయంలో చేసే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. వరద నీటి కాల్వ మళ్లింపుతో పాటు ఇతర పనులు చేసేందుకు నిధులు మంజూరు చేయనున్నదని తెలిపారు. దేవాలయ గుర్భగుడి, అమృతగుండతో పాటు ఇతర పనులు చేసేందుకు సర్వే చేయాలన్నారు.
న్యాల్కల్ మండలంలోని సిద్ధివినాయక దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. దేవాలయం వద్ద భక్తులు ఉండేందుకు అవసరమైన పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు, అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, తహసీల్దార్ నాగేశర్రావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్రావు, రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్, టీఆర్ఎస్ నాయకుడు తన్వీర్, మొహినొద్దీన్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.