జిన్నారం, ఆగస్టు 11 : తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మంగంపేటలో ఎమ్మెల్యే చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రధాన పాత్ర పోషించారన్నారు. మలి విడత తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
ఆనాటి తెలంగాణ పోరాట వీరులను నేటి తరానికి తెలిపేలా వారి విగ్రహాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. మంగంపేటలో రజకుల కోరిక మేరకు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు వెనకడుగు వేసేది లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి నిరంతరం పని చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశం గౌడ్, సర్పంచ్ ప్రశాంతి నరేందర్, ఉపసర్పంచ్ నక్కనాగరాజు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్, మాజీ సర్పంచ్ మల్లేశ్, రవి, రఘు, ప్రమీల, వెంకటేశ్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.