మెదక్ (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి, ఆగస్టు 11 : స్వరాష్ట్ర సాధనకు ఉద్యమాలు చేసిన టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించి ఆశీర్వదిస్తే ప్రజలకు అండగా ఉంటామని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. గురువారం టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షు డు చింతాప్రభాకర్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో రక్షాబంధన్ను పురస్కరించుకొని మహిళలతో మంత్రి మాట్లాడారు. జిల్లా తరపున మంత్రికి మహిళలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా.. ప్రభాకర్ అందుబాటులో ఉంటారా..అని అడిగి తెలుసుకున్నారు. ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ను ఆదరిస్తే అండగా ఉండి మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉన్నది.. మరొక్క అవకాశం ఇస్తే దేశానికే రోల్ మోడల్గా తయారు చేసి మెరుగైన పాలన అందిస్తామన్నారు.
ఈ సారి ఎన్నికల్లో చింతాప్రభాకర్ను గెలిపించి పనులు చేయించుకోవాలని, అందుబాటులో ఉండే నాయకుడు, అడిగిన వెంటనే పనిచేసి పెట్టే తత్వమున్న ప్రభాకర్ను గెలిపించాలని మంత్రి కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లోటీఆర్ఎస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు రామప్ప, షేక్ సాబేర్, నాయకులు శ్రావణ్ రెడ్డి, జలేంధర్ తదితరులు పాల్గొన్నారు.
బాలింతలకు కేసీఆర్ కిట్ అందుతుందా ? ఆయా సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి ? వాటి ప్రయోజనాలు ఎలా ఉన్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మహిళా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు మహిళా లబ్ధిదారులతో కలిసి మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు.
భూదమ్మ అనే మహిళ మాట్లాడుతూ గతంలో పింఛన్ రూ.200 మాత్రమే ఇచ్చే వాళ్లు సార్.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు రూ.3016, ఒంటరి మహిళలకు రూ. 2016 పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటామని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గర్భిణి లావణ్య మాట్లాడుతూ మొదటి డెలివరీ సర్కారు దవాఖానలో చేయించుకున్నా.
కేసీఆర్ కిట్ ఇచ్చారు సార్.. చాలా సంతోషంగా ఉన్నది. రెండో డెలివరీ కూడా సర్కారు దవాఖానలోనే చేయించుకుంటా అని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ కౌన్సిలర్లు ఆరేళ్ల గాయత్రి, రాగి వనజ, బట్టి లలిత, దొంతి లక్ష్మి, యశోద, వేదవతి, కల్యాణి, జయశ్రీ, మమత, రుక్మిణి, శేఖమ్మ, మానస, శమున్నీసాబేగం, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పుట్టి విజయలక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.
మంత్రి : ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా ?
సులేఖాబీ : సీఎం కేసీఆర్ దయవల్ల సకాలంలో పథకాలు, పింఛన్లు అందుతున్నాయి సార్.
మంత్రి : కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారా..?
సులేఖాబీ : కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
మంత్రి : చింతాప్రభాకర్ను ఈసారి గెలిపిస్తారా ?
సులేఖాబీ : ఈసారి ఎన్నికల్లో చింతా ప్రభాకర్ సాబ్ను తప్పకుండా గెలిపిస్తాం..అలాగే కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేసి మహిళల సత్తా ఏమిటో చూపిస్తాం. సాబ్.. షుక్రియా..