గజ్వేల్, ఆగస్టు 11 : వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో భారతదేశం ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆంధ్రాబ్యాంకు నుంచి సమీకృత మార్కెట్ చౌరస్తా వరకు ఫ్రీడమ్ 2కే రన్ నిర్వహించారు. 2కే రన్ను ఎఫ్డీసీ చైర్మన్ జెండా ఊపి ప్రారంభించగా, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, ఏసీపీ మడత రమేశ్ పాల్గొన్నారు.
పోలీసులు మూడు రంగుల్లో దుస్తులు ధరించి 2కే రన్లో పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని విద్యావంతులంతా వివిధ దేశాల్లో గొప్పస్థానాల్లో ఉన్నారన్నారు. ఆయా దేశాలు కూడా గొప్పగా ఎదుగుతున్నాయన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి మన దేశానికి ఉన్నదన్నారు. ఎందరో త్యాగధనుల పోరాటంతోనే స్వాతంత్య్రం సిద్ధించిందని, స్వతంత్రాన్ని అనుభవిస్తున్న మనమంతా దేశకీర్తిని నలుదిశలా చాటాలని పిలుపునిచ్చారు.
దేశ ప్రగతిలో ప్రతిఒక్కరూ అంకింతం కావాలన్నారు. గాంధీజీలా అహింసా మార్గంలో యువత నడవాలని, దురలవాట్లకు బానిసలు కావొద్దని సూచించారు. 14 సంవత్సరాలు నిర్విరామంగా సీఎం కేసీఆర్ శ్రమించారని, ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. గాంధీజీ బాటలో ఉద్యమించడంతో రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్న శుభ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రభుత్వ సం క్షేమ పథకాలు పేదలకు చేరినప్పుడే స్వాతంత్య్ర ఫలాలు అందినట్టన్నారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.