సిద్దిపేట, ఆగస్టు 11: సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాట చరిత్రను భావి పౌరులకు తెలిపి, వారిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేందుకే స్వతంత్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం ఉదయం 6.30గంటలకు సిద్దిపేటలోని పాత బస్టాండ్ నుంచి డిగ్రీ కాలేజీ మైదానం మీదుగా కోమటి చెరువు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. రన్ను జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ ప్రారంభించగా, కలెక్టర్, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.
ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, వాకర్స్, అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు, పోలీసులు జెండాలు చేతబూని, ‘భారత్ మాతాకీ జై.. వందేమాతరం’.. అని ర్యాలీలో నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. పోలీసుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటం గురించి భవిష్యత్ తరాలకు చెప్పేందుకు వజ్రోత్సవాలు ఎంతోగానో తోడ్పడుతాయన్నారు.
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ పాత్రను తెలియజేసేందుకు జిల్లాలో 10 సినిమా థియేటర్లలో విద్యార్థులకు ఉచితంగా సినిమా చూపిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు అందరూ తప్పక సినిమాను వీక్షించాలన్నారు. వందేండ్ల క్రితం నాటి పరిస్థితులను నేటి పిల్లలకు తెలియజేయాలన్నారు. రక్షాబంధన్ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అనాథ శరణాలయాలకు వెళ్లి, వారితో ఒక పూట గడిపి, బట్టలు పెట్టి, సహపంక్తి భోజనం చేస్తారన్నారు.
14వ తేదీన కోమటి చెరువు నెక్లెస్ రోడ్డులో హైదరాబాద్ కళాకారులతో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ రన్లో ప్రథమ స్థానంలో నిలిచిన భాస్కర్ గౌడ్, రెండోస్థానంలో నిలిచిన ఆనంద్, శ్రీవాణికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మహేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, డీపీఆర్వో రవి కుమార్, డీవైఎస్వో నాగేందర్, టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.