సిద్దిపేట/చేర్యాల/దుబ్బాక, ఆగస్టు 11 : హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న మాసం శ్రావణం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును పరమ పవిత్రంగా భావిస్తారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, అనురాగానికి ప్రతిరూపమైన రక్షాబంధన్ను కులమతాలకతీతంగా జరుపుకొంటారు. ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలు కట్టి, ఆశీర్వాదం పొందడంతో పాటు కానుకులను స్వీకరిస్తారు.
‘నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. మనమిద్దరం దేశానిక రక్ష’.. అని ఒకరికొకరు చెప్పుకుంటూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ కట్టుకుంటారు. ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పండుగగా జరుపుకొంటారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ రాఖీ పండుగను జరుపుకొని అందులోని ముఖ్య ఉద్దేశాన్ని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పూర్వం దేవతలు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం (12 సంవత్సరాలు) యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఓటమి పాలై పరివారంతో కలిసి అమరావతిలో తలదాచుకుంటాడు. విజేతలైన రాక్షసులు అమరావతిని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఇంద్రుడి భార్య శచీదేవి భర్తలో సమరోత్సాహం నింపుతున్నది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లు, లక్ష్మీనారణులను పూజించి వారి ప్రసాదంగా రక్షను ఇంద్రుడి చేతికి కడుతున్నది. దేవతలందరూ శివకేశవులను పూజించినా ఇంద్రుడికి రక్షలు కట్టి అండగా నిలబడుతారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో దేవేంద్రుడు విజయం సాధించి త్రిలోకాధిపతాన్ని పొందుతాడు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన రక్షాబంధనోత్సమే కాలక్రమంలో రాఖీ పండుగా అయింది.
మరో కథ సైతం చరిత్రలో ఉంది. దేశాన్ని విదేశీయులు పాలిస్తున్న రోజుల్లో మొగలాయిల దుర్నీతికి, దురాగతాలకు అంతు లేకుండా పోయింది. హిందూ మహిళలు మాన, ప్రాణ రక్షణ కోసం వీరులైన యోధులను గుర్తించి వారికి రాఖీలు కట్టి సోదరభావంతో రక్షణ పొందేవారు. ఆ రోజుల్లోనే ఒకసారి రాణి కర్ణావతి శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు ఢిల్లీ బాదుషాకు రాఖీ పంపగా, ఆయన ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టడమే కాక, ఆ సోదరి ఇంట భోజనం చేసి కానుకలు సమర్పించారని చరిత్ర చెబుతున్నది.
శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. విద్యార్థులు వేదపఠనాన్ని ప్రారంభిస్తారు. బ్రాహ్మణ సంఘాలు ఈ రోజుల ఉచితంగా జంధ్యాల మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్, జంధ్యాల మార్పిడితో మన సంప్రదాయాలను కాపాడుకుందాం.
కాలం మారడంతో పాటు రక్షాబంధనం తీరు మారింది, విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులరు పోస్టు ద్వారా రాఖీలను పంపుతున్నారు. రాఖీ కట్టుకొని తోబుట్టువులకు కానుకలు పంపుతున్నారు. ఆన్లైన్ ద్వారా రాఖీలను పంపి అభిందనలు తెలుపుకోవడం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి వెసులుబాటుగా మారింది. పద్ధతులు మారినా రాఖీలో అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కు చెదరలేదు.
భార్యాభర్త, సోదరీ సోదరులకు రాఖీ కట్టడం ద్వారా వారు తలపెట్టే కార్యాలు విజయవంతమై సుఖసంపదలు కలుగాలని ఆకాంక్షిస్తారు. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు, నూతన వస్ర్తాలు, చిరుకానుకలు సమర్పించి భార్యలు, సోదరీమణులను సంతుష్టులను చేస్తారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకుని విందు భోజనం చేస్తారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. గురువారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండుగను అనుబంధాలు, ఆప్యాయతలతో జరుపుకోవాలన్నారు.ప్రేమానురాగాలకు సంకేతమైన ఈ పండుగను ప్రతిఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని సూచించారు.