స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇంటింటా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా, ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ర్యాలీల్లో పాల్గొని, ‘భారత్ మాతాకీ జై.. వందేమాతరం’..నినాదాలతో హోరెత్తించారు.
సిద్దిపేటలో ఫ్రీడమ్ ర్యాలీని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ ప్రారంభించగా, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ శ్వేత తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటితరంలో నింపేందుకు మనం వారధిలా నిలవాలని పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రోజురోజుకూ రక్తికట్టి స్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో అన్ని వర్గాలు పాల్గొని, దేశభక్తిని చాటుతున్నాయి. నాల్గో రోజు గురువారం ఫ్రీడమ్ రన్ నిర్వహించగా, అనూహ్య స్పందన వచ్చింది. పల్లె నుంచి పట్టణం వరకు విద్యార్థులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
వృక్షాబంధన్ సందర్భంగా చెట్లకు విద్యార్థులు రాఖీలు కట్టారు. ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు స్వాతంత్య్రం గురించి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలను తిరంగా జెండాలతో అలంకరించి,
జై భారత్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మొక్కలు నాటారు.