వర్గల్, జూలై 28: ‘పైన కఠినమనిపించును.. లోన వెన్న అగుపించును.. ప్రాణమున్న మనిషికన్న.. శిలలేనయమనిపించును’.. అన్నాడు ఓ మహాకవి. చుట్టూ అందరు ఉన్నా, తనకు తానే ఒంటరితనం. శత్రువులు, దుష్టులు, దుర్మార్గుల కంటే కూడా.. జ్ఞాని మౌనంగా ఉండటం ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఈ సామెతను తెలుసుకొనే కావచ్చు ఓ యువకుడు తాను చదివింది మెడికల్ కోర్సు అయినా.. ప్రజలకు వైద్యం చేస్తూనే.. మరో పక్క పాట రచన మొదలు పెట్టాడు.. శబ్ధాలంకారాలు, చందోబద్ధ రచన కాకపోయినా, జనం మెచ్చే వాడుక భాషలో పాటల రూపంలో తన ఉద్దేశాన్ని తెలుపుతున్నాడు. సమాజంలో జరుగుతున్న మూఢాచారాలు, అసంఘటిత కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలపై మార్పు కోసం తాను సైతం సై అంటున్నాడు. రెండువేలకు పైగా పాటలు రాసి, పుట్టిపెరిగిన ఊరు.. కన్నవాళ్లకు పేరు తెస్తున్నాడు వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి చెందిన చీరాలరాజు(సాకలిరాజు)..
సాకలిరాజు స్వగ్రామం వర్గల్ మండలం నెంటూర్ గ్రామం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రాజు అమ్మా నాన్నలు సంప్రదాయ వృత్తి పని చేస్తూనే మరో పక్క తండ్రితోపాటు మరో ముగ్గురు అన్నలు తాపీ మేస్త్రీ పనులు చేస్తూ పెద్ద కుటుంబానికి ఆసరాగా నిలిచారు. నెంటూర్లో 10వ తరగతి వరకు ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన రాజు, గజ్వేల్లో ఇంటర్, డిగ్రీ చదివారు. చదువుకుంటూనే ఓ ప్రముఖ డాక్టర్ కింద వైద్యవృత్తిని అలవర్చుకొని, ఎల్కంటి గ్రామంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
రాజు మొదట్లో గజ్వేల్లోని ఓ ప్రైవేట్ దవాఖానాలో వైద్య సేవలు చేసి క్రమంగా రాయపోల్ మండలంలోని ఎల్కల్(ఎల్కంటి)లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రాథమిక చికిత్సలు చేస్తూనే నిత్యం తాను తెలుసుకుంటున్న బాహ్య ప్రపంచంలోని సంఘటనలు రచన వైపు దారితీశాయి. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, కులతత్వ విభేదాలు, అసమానతలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు, రైతు ఆత్మహత్యలు, వరకట్న వేధింపులు, పేదింటి జీవితాలు, తల్లీకూతుర్ల ప్రేమ సంబంధాలు, బావమరదళ్ల సరసాలు.. ఇలా ప్రతి ఇతివృత్త సంఘటనలు రాజును పాటల రచన వైపు మళ్లించాయి.
రాజుకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన పాటలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైన పాట పుడమితల్లిరా.. వచ్చన్న పోరాదా బావ.. రావమ్మ చెల్లి.. పోరులోకి గజ్జల్ గలగల సప్పుడు.. నువ్వు ఇక రావని.. రెక్కలు వచ్చిన ప్రేమ.. నా ఎండికొండ బంగారయ్య పాటలు రాజును రాష్ట్రస్థాయికి చేర్చాయి.
సమాజంలో జరుగుతున్న విపరీత ధోరణులతో రోజురోజుకూ యువత పెడదారి పడుతున్నది. నిత్యం అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. రైతు ఆత్మహత్యలు.. కులవివక్ష.. పేదరిక నిర్మూలన.. ఆధిపత్య ధోరణులపై రచనలు చేయడం చాలా ఇష్టం. నా పాటకు ఈ అంశాలే ఆధారాలు.. మంచి సమాజం.. మంచి నడవడిక యువతీయవకుల్లో మార్పే నా రచనకు మూలం.
– చీరాల(సాకలి)
2003లో రవీంద్రభారతిలో జరిగిన జానపద, వ్యాసరచన పోటీలో నందిని సిధారెడ్డి చేతులమీదుగా అవార్డు తీసుకున్నారు. 2004లో సంగారెడ్డిలో వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి, 2007లో రాసిన గేయరచనకు సుద్దాల అశోక్తేజ, గోరేటి వెంకన్న, నందిని సిధారెడ్డి నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2018లో తెలంగాణ సేవారత్నం అవార్డును అందుకోగా, 2021లో తన రచన సేవకు గానూ వరంగల్లో నిర్వహించిన కన్నతల్లి ఫౌండేషన్ ‘కాకతీయనంది పురస్కారం’తో పాటు జాతీయ విశిష్ట పురస్కారాలు అందుకున్నారు.