పట్టణప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు ‘బస్తీ దవాఖాన’లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వీటిని ఏర్పాటు చేయగా, తాజాగా మెదక్ జిల్లా కేంద్రంలో ఒక బస్తీ దవాఖాన నెలకొల్పేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోల్కొండ వీధిలోని కమ్యూనిటీ హాల్లో సెంటర్ను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. దవాఖాన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించనుండగా, సుమారు రూ.18లక్షలు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. కాగా, ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్నర్సు, ఇద్దరు సహాయకులు దవాఖానలో సేవలు అందించనున్నారు.
మెదక్, జూలై3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, పల్లెల్లోని అన్ని ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. సాధారణ వైద్యంతో పాటు బీపీ, షుగర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు, మందుల పంపిణీ కోసం జిల్లాలోని పలు సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చింది. ఇదే క్రమంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు సత్వర వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మాదిరిగా బస్తీ దవాఖానను మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని స్లమ్ ఏరియా అయిన గోల్కొండ వీధిలోని కమ్యూనిటీహాల్లో బస్తీ దవాఖానను ఏర్పాటు చేసి నిరుపేదలకు సాధారణ వైద్యం అందుబాటులోకి తీసుకురానున్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో నెలకొల్పనున్న బస్తీ దవాఖానలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఉత్తర్వులను ఇటీవల కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. బస్తీ దవాఖానకు సుమారు రూ.18 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యాధికారులు తెలిపారు. మున్సిపాలిటీ తీర్మానం చేసి నిధులను కేటాయించాల్సి ఉన్నది. నూతనంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి దాని ద్వారానే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రజలకు క్షేత్ర స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానను అందుబాటులోకి తీసుకువస్తున్నది. జిల్లా కేంద్రంలో ఒక బస్తీ దవాఖాన మంజూరు కాగా, గోల్కొండ వీధిలోని కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్సు, ఇద్దరు సహాయకులు అందుబాటులో ఉంటారు.
– డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో
ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నది. మాతాశిశు సంరక్షణ కేంద్రాలతో పాటు డయాలసిస్ సెంటర్, డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ మాదిరిగా జిల్లా కేంద్రంలో బస్తీ దవాఖాన ఏర్పాటు కానున్నది. టీ-డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఎక్కడికక్కడ శాంపిల్స్ సేకరించి రోగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఉచిత వైద్యం, ఉచితంగా మందులు లభించనున్నాయి.
– ఎం.పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే మెదక్