రామాయంపేటరూరల్, మే 26 : తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కుల వృత్తులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. అన్ని కులాలకు ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ఆర్థిక ఎదుగుదలకు సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నాయీబ్రాహ్మణులు, రజకులకు దోబీఘాట్ల వద్ద 250 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని చాలా గ్రామాలకు కటింగ్ షాపుల వద్ద, దోబీఘాట్లు, ఇస్త్రీ(ఐరన్) దుకాణాల వద్ద మీటర్లు బిగించారు. రామాయంపేట మండల పరిధిలో నాయీబ్రాహ్మణులకు 38, రజకులకు 114 మొత్తం 152 మీటర్లు బిగించినట్లు విద్యుత్ శాఖ ఏఈ పెంట్యానాయక్ తెలిపారు. వీటి వల్ల చాలా వరకు విద్యుత్ బిల్లులు మిగిలి ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నాయీబ్రాహ్మణులకు, రజకులకు ఇచ్చిన 250 యూనిట్లు ఉచిత విద్యుత్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. వీటిని కేవలం దోబీఘాట్లు, హెర్ సెలూన్ దుకాణాలకు మాత్రమే వినియోగించాలి. తప్పుదారి పట్టిస్తే చర్యలు తీసుకుంటాం. ఇది చక్కటి పథకం దాదాపు కరెంటు బిల్లుల మిగిలిపోయి ఆర్థికంగా ఎదుగవచ్చు.
– పెంట్యానాయక్, ఏఈ రామాయంపేట
రోజంత కష్టపడి కటింగ్ చేసి సంపాధించిన డబ్బుల్లో చాలా వరకు కరెంటు బిల్లు లు చెల్లించడానికే సరిపోయేవి. ఎండాకాలంలో మరీ ఎక్కువ విద్యుత్ వినియోగం ఉండేది. దాదాపు కరెంటు ఎక్కువ వాడేవాళ్లం. నెలకు సుమారు రూ. 2వేలకు పైగా బిల్లులు చెల్లించేవాళ్లం. కానీ నేడు 250యూనిట్లు ఉచిత విద్యుత్ రెండు నుంచి మూడు నెలల వరకు వస్తున్నది. కరెంటు బిల్లులు తప్పాయి.
– మంగళి నాగులు
మా కుల వృత్తి బట్టలు పిండటంతో పాటు ఇస్త్రీ కూడా చేస్తాం. గతంలో బొగ్గు ల పెట్టెతో ఇస్త్రీలు చేసేవాళ్లం. కానీ నేడు అన్ని గ్యాస్ సిలిండర్లు కావడంతో బొగ్గులు దొరకడం కష్టం అయింది. దీంతో కరెంటు పెట్టె ద్వారా చేయడం ప్రారంభించాం. దీంతో విద్యుత్ బిల్లులు నెలకు వెయ్యి రూపాయలకు పైగా వచ్చేవి. కానీ ప్రభుత్వం అందించిన 250 యూనిట్లు ఉచిత విద్యుత్ తరువాత చాలా మేలు జరిగింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– పోచయ్య, రజకుడు