మెదక్, జనవరి 24 : గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకుని మెదక్ నియోజకవర్గం టీఆర్ఎస్ హయాంలో అన్నిరంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నా రు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చారని తెలిపారు. మెదక్ నుంచి గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఇందిరాగాంధీ చేయని పనులను సీఎం కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. జిల్లా కేంద్రం ఏర్పడక ముందు పట్టణంలోని కొన్ని జిల్లా కార్యాలయాలు సంగారెడ్డికి తరలిపోతుంటే స్వార్థపరులు నోరుమెదపలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ఉద్దేశంతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యతను కల్పిస్తూ రూ.వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మెదక్ పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ, చౌరస్తాలో విద్యుత్దీపాల ఏర్పాటు, ఇంటింటికీ నల్లానీరు, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. మెదక్ జిల్లా కేంద్రానికి జాతీయ రహదారుల నిర్మాణం కోసం తాను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో హైదరాబాద్లోని చింతలబస్తీ నుంచి బాలానగర్ మీదుగా మెదక్ పట్టణానికి రూ.322 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. మెదక్ నుంచి బోధన్ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటు మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు జాతీయ రోడ్డు నిర్మాణానికి రూ.882.18 కోట్లు మంజూరయ్యాయని జీవో కాపీని చూపించారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.
తారు రోడ్డు మరమ్మతులకు రూ.8.90 కోట్లు మంజూరు..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణం మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. మెదక్ నియోజకవర్గంలోని తారు రోడ్ల మరమ్మతులకు రూ.8.90 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో మెదక్ నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల్లోని అన్ని తారు రోడ్డు మరమ్మతులు జరుగనున్నాయని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలోని వివిధ మడలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8.30 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. హవేళీఘనపూర్ మండలానికి రూ.కోటి, నిజాంపేట మండలానికి రూ.కోటి 50 లక్షలు, రామాయంపేట మండలానికి రూ.80 లక్షలు, చిన్నశంకరంపేట మండలానికి రూ.కోటి 10 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా నిధులు మం జూరు చేసిన సీఎం కేసీఆర్కు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జిల్లా మంత్రి హరీశ్రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు తాడెపు సోములు, కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, కిశోర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, ఉమర్ పాల్గొన్నారు.