తూప్రాన్/మనోహరాబాద్, ఫిబ్రవరి 23: నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన 2023-24 బడ్జెట్ అంచనా సమావేశానికి కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. మెదక్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మొదటిసారిగా తూప్రాన్కు విచ్చేసిన కలెక్టర్కు మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్ కౌన్సిల్లో ప్రవేశపెట్టిన రూ.25.70 కోట్ల బడ్జెట్ ప్రతులను అకౌంటెంట్ వెంకట్ రావు చదివి వినిపించారు. అంతకుముందు తూప్రాన్లో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ను పరిశీలించారు.
నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం తూప్రాన్లోని సామాజిక దవాఖానను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలని, ప్రసవాలు జరిగిన వెంటనే కేసీఆర్ కిట్లు అందజేయాలని దవాఖాన సూరింటెండెంట్ డాక్టర్ అమర్సింగ్కు సూచించారు. అనంతరం మనోహరాబాద్ చేరుకున్న కలెక్టర్ అక్కడ రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖానను పరిశీలించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, కమిషనర్ మోహన్, ఏఈ సాయిరాంరెడ్డి, పంచాయతీ రాజ్ డీఈ నర్సింలు, ఏఈ జుంకీలాల్ తదితరులు పాల్గొన్నారు.