మెదక్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 9న ఓటర్ల ముసాయిదా ప్రకటించే నాటికి జిల్లాలో 4,06,629 మంది ఓటర్లు ఉన్నారని, నేడు తుది జాబితా ప్రకటించే నాటికి 4,09,473 మంది ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్తో, పాఠశాల, కళాశాలల్లో క్యాంపస్ అంబాసిడర్ల ద్వారా, లిటరసీ క్లబ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు బ్లాక్ స్థాయిలో ఇంటింటికీ తిరిగి 18 ఏండ్లు నిండిన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయడం, స్వీప్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడం వంటి వాటితో కొత్తగా 9,860 ఓటర్లుగా నమోదయ్యారన్నారు.
మెదక్ నియోజకవర్గంలో 2,02,636 మంది ఓటరు ఉండగా ఇందులో 1,05,077 మంది మహిళా ఓటర్లు, 97,556 మంది పురుష ఓటర్లు, ఇతరులు ముగ్గురు ఉన్నారని రమేశ్ తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,06,837 మంది ఓటర్లు ఉండగా అందులో 1,04,710 మంది మహిళా ఓటర్లు, 1,02,120 మంది పురుష ఓటర్లు, ఏడుగురు ఇతరులు ఉన్నారన్నారు. జనాభా లెక్కల ప్రకారం రెండు నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ తుది జాబితాను జిల్లాలోని 576 పోలింగ్ బూతుల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నుంచి గూడెం ఆంజనేయులు, బీజేపీ నుంచి శివ, టీడీపీ నుంచి మహమ్మద్ అఫ్జల్, బీఎస్పీ నుంచి అప్పాజిపల్లి సురేశ్, ఆర్డీవో సాయిరాం, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, నరేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఓటర్లు 12,13,751 మంది
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 5: సంగారెడ్డి జిల్లాలో మొత్తం 12,13,751 మంది ఓటర్లు ఉన్నారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 12,13,751 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 6,14,334 మంది పురుషులు, 5,99,366 మంది మహిళలు, ఇతర ఓటర్లు 51 మంది, సర్వీసు ఓటర్లు 361 మంది ఉన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జనవరి 1 నాటికి సవరించిన జిల్లా ఓటర్ల జాబితాను గురువారం విడుదల చేశారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతను ఓటరు జాబితాలో చేర్చారు.
రెండు నెలల్లో పెరిగిన 17,868 మంది ఓటర్లు
జిల్లాలో రెండు నెలల్లో 17,868 మంది నూతన ఓటర్లు నమోదయ్యారు. నవంబర్ 9న ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా ప్రకారం జిల్లాలో 11,95,883 మంది ఓటర్లు ఉండగా. అందులో 6,05,871 మంది పురుషులు, 5,89,977 మంది మహిళలు, 35 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. గురువారం విడుదల చేసిన తుది ఓటరు జాబితాలో 12,13,751 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,14,334 మంది పురుషులు, 5,99,366 మంది మహిళలు, ఇతర ఓటర్లు 51 మంది, సర్వీసు ఓటర్లు 361 మంది ఉన్నారు.
8,86,560 మంది ఓటర్లు
సిద్దిపేట అర్బన్, జనవరి 5 : కేంద్ర ఎన్నికల సంఘం, ముఖ్య ఎన్నికల అధికారి సూచనల మేరకు సిద్దిపేట జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు తుది జాబితా ప్రచురించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో మొత్తం 8,86,560 మంది ఓటర్లు ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,27,227 మంది, సిద్దిపేట నియోజకవర్గంలో 2,18,770 మంది, దుబ్బాక నియోజకవర్గంలో 1,87,892 మంది, గజ్వేల్ నియోజకవర్గంలో 2,52,671 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాను రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచుతామని తెలిపారు.