మెదక్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): జీవో నెంబర్ 59 కింద స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వం నిర్దేశించిన డబ్బును పక్షం రోజుల్లోగా చెల్లించేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు చొరవ చూపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ల్యాండ్ పూలింగ్, జీవో నెంబర్ 59 కింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రగతిపై అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల కోసం ఆక్రమించిన స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ధర నిర్ణయించిందని, ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 203 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఏడుగురు పూర్తిగా, కొందరు మొదటి, రెండో విడత డబ్బులు చెల్లించారన్నారు. మూడు విడతలుగా డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లిస్తే 5 శాతం డిసౌంట్ ఇస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. ప్రజోపయోగ అవసరాల నిమిత్తం కావాల్సిన భూమిని ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సేకరించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రగతిని సమీక్షిస్తూ పట్టాలు అందించిన వారి వివరాలు 4బీ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ముగింపు దశలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి మర్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, సంబంధిత వార్డు, గ్రామాలు ప్రదర్శించి తుది జాబితా పంపాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 13, రామాయంపేట కెనాల్ పనులకు సంబంధించి భూసేకరణ, సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, భూ సేకరణ, 13వ ప్యాకేజీ, రామాయంపేట, శంకరంపేట కెనాల్ పనులకు సంబంధించి అదనపు కలెక్టర్ రమేశ్, నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఏజెన్సీలతో మాట్లాడారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రామాయంపేట కాల్వకు సంబంధించి భూ సేకరణ, చిన్న శంకరంపేట్కు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి పెగ్ మారింగ్ వెంటనే పూర్తి చేయాలన్నారు. అవార్డు పాసైన వాటికి నిధులు మంజూరు చేయాలని సూచించారు. సర్వే టీమ్లు ఏర్పాటు చేసి వారం రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారిని ఆదేశించారు. ఏజెన్సీలు కూడా పనుల వేగవంతానికి సర్వే టీమ్ తెచ్చుకుని అధికారుల సమన్వయంతో సర్వే పూర్తి చేస్తే పెగ్ మారింగ్తో పాటు డీజీఆర్ఎస్ చేయాలన్నారు. కొండ పోచమ్మ జలాశయం నుంచి ఈ యాసంగిలో రామాయంపేట, చిన్న శంకరంపేట్ మండలాల్లోని కొన్ని ఎకరాలకైనా సాగు నీరందించేలా కృషి చేయాలని ఏజెన్సీలను కోరారు. సమావేశంలో నీటిపారుదల ఎస్ఈ యేసయ్య, ఈఈ శ్రీనివాస్ రావు, డీఈఈ శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ ఎస్ఈ వేణు, ఈఈ నారాయణ్ రావు, ఆర్డీవోలు సాయిరామ్, శ్యామ్ ప్రకాశ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శశికుమార్, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ జానకీ రామ్సాగర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.