తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా చెరువులు, కాల్వల వెంట మొక్కల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.గురువారం కలెక్టరేట్లో ఉపాధి హామీ పథకం, ఓడీఎఫ్ ప్లస్ స్వచ్ఛ సర్వేక్షణ్, హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ ప్లాంటేషన్ చేసేందుకు 3 నుంచి 30 ఎకరాలకు పైగా ఎఫ్టీఎల్ ఉన్న చెరువులను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసి డీపీఆర్ రూపొందించాలని సూచించారు. ప్రతి వైకుంఠధామంలో మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పంచాయతీలో 150 మంది కూలీలకు తగ్గకుండా పనులు కల్పించాలన్నారు. ఇంకా 12 చోట్ల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, వెంటనే నిర్మించాలని ఆదేశించారు.
మెదక్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): పచ్చదనంతో పాటు ఫల సంపదను పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో విడత హరితహారంలో సంపద వనాల పేరిట నీటిపారుదల సౌకర్యం ఉన్న నేలల్లో మొకల పెంపకాన్ని చేపట్టనుందని మెదక్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఉపాధి హామీ పథకం, ఓడీఎఫ్ ప్లస్, స్వచ్ఛ సర్వేక్షణ్, హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చెరువులు, కాల్వల వెంట బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించిందని, దీనికి సంబంధించి జిల్లాలో 2,600 చెరువులకు సంబంధించి 17,532.4 కిలో మీటర్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఎలాంటి వివాదాలు లేని మూడు ఎకరాల నుంచి 30 ఎకరాలకు పైగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న చెరువు ప్రాంతాలను గుర్తించి బ్లాక్ ప్లాంటేషన్ చేసేందుకు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. అన్ని అంశాలపై ఎంపీడీవో, ఎంపీవో, నీటిపారుదల, ఏపీఎంల బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి డీపీఆర్ రూపొందించాలని సూచించారు. పెద్ద పెద్ద మొకలు నాటేలా ప్రతి పంచాయతీలో అవసరమైన మొకలను సిద్ధం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ కోసం డీపీఆర్ రూపొందించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అధికారులు శుక్రవారం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించి 17 కాలమ్స్ ప్రొఫార్మాలో నివేదికలు అందజేయాలని ఆదేశించారు.
పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష సందర్భంగా కలెక్టర్ ప్రతి వైకుంఠధామం వినియోగంలోకి రావాలన్నారు. వాటికి అవసరమైన విద్యుత్, నీటి సరఫరాకు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో కనీసం 150 మంది కూలీలకు పని కల్పించాలన్నారు. మిగిలిన 12 గ్రామ పంచాయతీల్లో వెంటనే తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు పొందేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరా రు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, బహిరంగ ప్రదేశాలు శుభ్రం గా ఉంచడం, పెయింటింగ్, గోడ పత్రికల ద్వారా సుస్థిర లక్ష్యాలు సాధించిన వివరాలను ప్రజలకు చేరుస్తూ ఆదర్శంగా ఉన్న పంచాయతీలు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఈ నెల 30లోగా యాప్లో వివరాలు పొందుపరచాలని సూచించారు. ఒకో మండలం నుంచి 15 గ్రామాలు అవార్డు కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా జూన్ నాటికి జిల్లాలో ఎకరా లోపు ఉన్న చెరువులను పూడిక తీయించాలన్నారు. ఆ వివరాలను BAISA యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో శైలేశ్, నీటిపారుదల ఈఈ శ్రీనివాస్ రావు, డీఎఫ్ఓ రవి ప్రసాద్, డీపీవో సాయిబాబ, మున్సిపల్ కమిషనర్లు మోహ న్, వెంకట గోపాల్, ఉమాదేవి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.