మెదక్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీ రాజ్ ఈఈ సత్యారెడ్డిని ఆదేశించారు. చివరి దశలో ఉన్న ఇండ్లను అన్ని మౌలిక వసతులతో వేగవంతంగా సిద్ధం చేసి లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా ఉంచాలని జిల్లా పౌరసరఫరా అధికారి శ్రీనివాస్ను ప్రత్యేకాధికారిగా నియమించామని తెలిపారు. సోమవారం ఆయన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 5,254 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, ఇంతవరకు 3,665 ఇళ్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చి 2,344 ఇండ్లు పూర్తి చేశామని, 1,061 ఇండ్ల ప్రగతి చివరి దశలో ఉన్నాయన్నారు.
వచ్చే జనవరి 15 నాటికి నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. అందుకనుగుణంగా ఇండ్ల కాలనీలకు విద్యుత్, నీటి సరఫరా, మురుగునీరు, అప్రోచ్ రోడ్ వంటివి అన్ని మౌలిక వసతులు కల్పించి దశలవారీగా పూరె్తైన ఇండ్లను సంక్రాంతి వరకు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని 10 మండలాల్లో 1,061 ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయన్నారు. రామాయంపేట్లో 304, మెదక్లో 125, చేగుంటలో 108, నిజాంపేట మండలంలో 152, పాపన్నపేటలో 104, వెల్దుర్తి మండలంలో 149, మనోహరాబాద్లో 72, నర్సాపూర్లో 30, మాసాయిపేటలో ఒకటి ఉన్నట్లు వివరించారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి జాబితా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ సత్యా రెడ్డి, హౌసింగ్ ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.