మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 27: మెదక్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం రసాభసగా మారింది. ఎమ్మెల్యే, కౌన్సిలర్ మధ్య వాదోపవాదాలతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మెదక్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 50.90 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ను మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా బడ్జెట్పై చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో పాటు పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు. పట్టణాభివృద్ధికి నిధులు అవసరం ఉన్నాయని, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెదక్ ప్రజలు తనను ప్రేమతో గెలిపించుకున్నారని, పట్టణాభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని, త్వరలోనే పట్టణంలోని చౌరస్తాల సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కోరడం సబబైనా, 20 ఏండ్లుగా ఆస్తి పన్ను చెల్లించని దుకాణాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేస్తే చైర్మన్ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పన్నులు చెల్లిస్తేనే మున్సిపల్కు ఆదాయం చేకూరడంతోపాటు పట్టణం అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇస్తున్నదని, పాత పనుల బిల్లులు చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదంటూ ప్రస్తావించారు. దీనికి ఎమ్మెల్యే స్పందించి.. కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యిందని, గత ప్రభుత్వంలోని అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయన్నారు. దళితబంధు పథకం ద్వారా దళితులందరికీ లబ్ధి చేకూరలేదని ఎమ్మెల్యే ప్రస్తావించగా, 5వ వార్డు కౌన్సిలర్ ఆంజనేయులు జోక్యం చేసుకుని రాష్ట్ర బడ్జెట్ కాదు మున్సిపల్ బడ్డెట్లో మున్సిపల్కు సంబందించిన విషయాలే మాట్లాడాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే కౌన్సిలర్ మధ్య మాటల యుద్ధ్దం కొనసాగింది. ఎమ్మెల్యేను బడ్జెట్ సమావేశానికి ఆహ్వానించి అవమానిస్తారా అంటూ ఆంజనేయులుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. అనంతరం అనంతరం అకౌటెంట్ ఆదాయ, వ్యయాలను గౌరవ సభ్యులకు వివరించారు. 2024-25కు 50.91 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఖర్చులు రూ.50.89 కోట్లు అవుతున్నట్లు బడ్జెట్లో చూపారు. ఇందులో గతేడాదితో పోలిస్తే రూ.17 కోట్ల ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది. ఖర్చులు సైతం అదేవిధంగా పెరుగుతున్నట్లు లెక్కల్లో తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కమిషనర్ జానకిరామ్ సాగర్, డీఈ మహేశ్, టీపీవో భూపతి కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ గౌడ్, శేఖర్, జయరాజ్, సుంకయ్య, కిశోర్, సమీయొద్ద్దీన్, విశ్వం, లలిత, కల్యాణి, మేఘమాల, జయశ్రీ, వేదవతి, చందన, శేకమ్మ తదితరులు పాల్గ్గొన్నారు.