యాసంగి పనులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు మడులను సిద్ధం చేసుకుని నారు పోసుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా పైపైకి వస్తుండడంతో పంటల సాగు విస్తీర్ణం పెరుగనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మెదక్ జిల్లాలో 2,43 లక్షల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1,67,667 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా. ఇదిలా ఉండగా, ప్రస్తుత యాసంగిలో అన్నదాతలు వరిసాగుకే మొగ్గు చూపుతున్నట్లు అధికారుల అంచనా లెక్కలు చెబుతున్నాయి. గతేడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరుగనున్నదని తెలుస్తున్నది.
మెదక్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రైతాంగం యాసంగి సాగుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకొని విత్తనాలు వేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు, చెరువులలో పుషలంగా నీరు ఉంది. భూగర్భ జలాలు కూడా పెరగడంతో బోరుబావుల వద్ద నీటికి ఇబ్బంది లేదు. అన్నదాతలు వరి సాగుకే అధిక శాతం మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు 90శాతం పూర్తయ్యాయి. దీంతో రైతులు మళ్లీ నారుమడులు సిద్ధం చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశమున్నది. ఇదిలావుండగా వానకాలంలో సన్న వడ్లు పండించిన రైతులు యాసంగిలో దొడ్డు రకం వడ్లకే మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు కూడా సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెదక్లో పెరుగుతున్న సాగు విస్తీర్ణం..
యాసంగిలో ప్రతి ఏటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ ఏడాది వర్షాలు భారీగా కురవడంతో ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు మత్తళ్లు దూకాయి. సింగూరు ప్రాజెక్టు నిండగా నీటిని వదలడంతో ఘణాపూర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నీరు ఉండడంతో అన్ని గ్రామాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది యాసంగిలో 1,67,792 ఎకరాలు సాగు కాగా, ఈ ఏడాది 2,43 లక్షల ఎకరాలు సాగు చేయనున్నారని, ఇందులో వరి 2,10,455 ఎకరాలు, మొకజొన్న 9900, పొద్దుతిరుగుడు 2800, వేరుశనగ 820, నువ్వులు 870, ఆవాలు 140, జొన్న 6543 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. ఇందుకు అనుగుణంగా వడ్లు 52,611 క్వింటాళ్లు, మొకజొన్న 654, పొద్దుతిరుగుడు 70, శనగ 558, వేరుశనగ 3640, జొన్న 261, గోధుమ 328, నువ్వులు 21 క్వింటాళ్లు ఇతర పంటల విత్తనాలు అవసరం కానున్నట్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2.43 లక్షల ఎకరాల్లో సాగయ్యే వివిధ రకాల పంటలకు యూరియా 21,032 మెట్రిక్ టన్నులు, డీఏపీ 5475, పొటాష్ 4281, సింగిల్ సూపర్ఫాస్పేట్ 3148 మెట్రి క్టన్నులు వంటి ఎరువులు అన్నీ కలిపి 46385 మెట్రక్ టన్నులు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
సంగారెడ్డి జిల్లాలో 1,67,667 ఎకరాల్లో పంటల సాగు
సంగారెడ్డి, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): యాసంగిలో సంగారెడ్డి జిల్లాలోని రైతాంగం వరి సాగుకు ఆసక్తిచూపుతున్నారు. జిల్లాలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల్లో నిండుగా ఉండటంతోపాటు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. దీనికితోడు జిల్లాలో భూగర్బజల మట్టాలు పెరిగాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో రైతులు వరి సాగువైపు మొగ్గుచూపుతున్నారు. గత యాసంగిలో రైతులు 35,252 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది 82,382 ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. అయితే అధికారుల అంచనాను మించి రైతులు లక్ష ఎకరాలకుపైగా వరి సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ యాసంగిలో రైతులు 1,67,667 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు.
అత్యధికంగా వరి 82,382 ఎకరాల్లో, జొన్న 19,936, మొక్కజొన్న 4482, చెరుకు 16588, శనగ 33,142, పొద్దుతిరుగుడు 6040, వేరుశనగ 1182 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా. మిగితా విస్తీర్ణంలో రైతులు గోధుమ, నువ్వులు, సోయాబీన్ ఇతర పంటలు సాగు చేయనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5934 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. మొక్కజొన్న 427 ఎకరాల్లో, జొన్న 501, శనగ 3487, పొద్దుతిరుగుడు 1477, నువ్వులు 23, 5 ఎకరాల్లో గోధుమ పంటలను సాగు చేశారు. శనగ విత్తనాలు విత్తుకునేందుకు సమయం ఇంకా ఉండటంతో అంచనాకు అనుగుణంగా శనగ పంట 33వేల ఎకరాల్లో సాగు కానున్నది. పత్తి తీతలు పూర్తికాకపోవటం, వడ్ల కొనుగోళ్లు కొనసాగుతుండగా యాసంగి సాగు పనులు ఊపందుకోలేదని చెప్పవచ్చు.
అవగాహన కల్పించిన విస్తీర్ణాధికారులు..
యాసంగి సీజన్లో పత్తి పంట వేసే విధంగా గత నెల 30 వరకు రైతు వేదిల్లో వ్యవసాయ విస్తీర్ణాధికారులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. సహాయ వ్యవసాయ సంచాలకుల ఆధ్వర్యంలో ఈ యాసంగి సీజన్లో వ్యవసాయ పద్ధతుల గురించి వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వేరుశనగ పంటలో జిప్సం దాతు తప్పనిసరిగా వాడే విధానం, శనగ పంటలో ట్రైకోడెర్మా విరిడి విత్తన శుద్ధి, ఇతర పద్ధతుల ద్వారా వాడే విధానంపై, వివిధ రకాల పంటల్లో భాస్వరం కరిగించు జీవన ఎరువుల వాడకంపై, నియమిత మోతాదులో వివిధ రకాల రసాయన ఎరువులు వాడకంపై క్షేత్ర ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
బోరు బావుల వద్ద నీరు పుష్కలం..
ఈ ఏడాది వర్షాలు భారీగా కురవడంతో బోరు బావుల వద్ద నీరు పుష్కలంగా ఉంది. దీంతో ఈ యాసంగిలో రైతులు వరి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత యాసంగిలో అత్యధికంగా పంటలు సాగయ్యే అవకాశమున్నది. ఇప్పటికే వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతు వేదిక వద్ద రైతులకు వివిధ పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. – ఆశాకుమారి, వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా అధికారి