తూప్రాన్/ మనోహరాబాద్, మే 20: హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకుని ధాన్యం వచ్చిన 24 గంటల్లో దించుకుని, ట్రక్ షీట్ అందజేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీనివాస్తో కలిసి మనోహరాబాద్ మండలం దండుపల్లి, తూప్రాన్ బైపాస్ నాగులపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తూప్రాన్ మండలంలోని నవదుర్గా, సాయినాథ్, వీరభద్ర రైస్ మిల్లులను సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉన్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి ట్యాగింగ్ చేసి మిల్లులకు తరలించాల్సిందిగా కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో మిల్లుల వద్ద లారీలు వేచి ఉండరాదని స్పష్టం చేశారు. అకాల వర్షంతో ధాన్యం కాస్త చెడిపోయినా, తాళ్లు ఉన్నా, రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యంలో ఎలాంటి కోత విధించరాదని మిల్లర్లకు సూచించారు.
ఎఫ్సీఐకి పెండింగ్ ఉన్న సీఎంఆర్ను అందించేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున, లక్ష్యం మేరకు రోజుకు ఏసీకేల చొప్పున ధాన్యాన్ని సనత్నగర్లోని ఎఫ్సీఐకి తరలించాలని మిల్లర్లకు సూచించారు. గన్నీ సంచులపై వేస్తున్న స్టెన్సిల్స్ను జాగ్రత్తగా గమనించి, అన్ని అక్షరాలు పడేలా చూడాలన్నారు. ధాన్యం భద్రపరిచేందుకు స్థలం కొరత లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి రోజూ ధాన్యం సేకరణపై మానిటరింగ్ చేస్తున్నామని, గోనె సంచులు, లారీల సమస్య ఉత్పన్నం కాకుండా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లేదా వే బ్రిడ్జి కాంటాల్లో తూకంలో ఎలాంటి తేడాలు గమనించినా కంట్రోల్ రూమ్ 08452 223360, 98805915768 నెంబర్లలో ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 407 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 23,319 మంది రైతుల నుంచి 218.16 కోట్ల విలువైన 1,05,901 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 9,976 మంది రైతుల ఖాతాల్లో 77.21 లక్షలు జమ చేశామన్నారు. ఆయన వెంట తూప్రాన్ తహసీల్దార్ జ్ఞానజ్యోతి, మనోహరాబాద్ తహసీల్దార్ భిక్షపతి తదితరులున్నారు.