అమీన్పూర్, జూన్ 25 : ఇరుకు రోడ్డుతో సతమతమవుతున్న వాహనదారులకు ఊరట కలగనుంది. ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న అమీన్పూర్ ప్రజల కల సీఎం కేసీఆర్ హామీతో తీరుతున్నది.15 ఫీట్ల రోడ్డు ఇప్పుడు 100 ఫీట్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కిష్టారెడ్డిపేట నుంచి బీరంగూడ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులతో రవాణా సేవలు మెరుగపడనున్నాయి. అడుగడుగునా గుంతలమయం. కిష్టారెడ్డిపేట్ నుంచి బీరంగూడ రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ మార్గంలో వెళ్లాలంటేనే జనం ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకోవాలి. పైగా ఈ మార్గం 15 ఫీట్ల రోడ్డు మాత్రమే కావడంతో ఎదురెదురుగా భారీ వాహనాలు వెళ్లాలంటే కష్టమే. చిన్నగా ఉన్న రోడ్డును విస్తరించాలని చాలాసార్లు జనం ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నోమార్లు ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా హామీలకే పరిమితమైం ది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక బీరంగూడ,కిష్టారెడ్డిపేట్ రహదారికి మోక్షం కలిగింది.
ఎమ్మెల్యే చొరవతో కదిలిన పనులు
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కొండాపూర్ దేశంలో ఐటీ పరిశ్రమలకు దిక్చూచిగా గుర్తింపు పొందాయి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, ఇతరత్రా వ్యాపారులు ఇక్కడ ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్గూడ, సుల్తాన్పూర్, ఐలాపూర్, ఇంద్రేశం తదితర ప్రాం తాల్లో జనాభా పెరుగుతున్నది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 15 ఫీట్ల ఇరుకైన రోడ్డును విస్తరించాలని ప్రజాప్రతినిధులకు ప్రజలు విజ్ఙప్తి చేశారు. దీంతో ఈ సమస్యను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. 2018 శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరుకు వచ్చిన సీఎం కేసీఆర్కు ఈ రహదారి సమస్యను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వివరించారు. ఏడాదిలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనుల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా కరోనాతో కొంతకాలం బ్రేక్ పడింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని రహదారికి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించడంతో పాటు రూ.49 కోట్ల నిధులు విడుదల చేయించారు.
జోరుగా విస్తరణ పనులు
కిష్టారెడ్డిపేట్ రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. 15 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా 5 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న జనానికి రోడ్డు విస్తరణ రిలీఫ్ ఇవ్వనుంది. సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ యూసుఫ్ హుస్సేన్ పర్యవేక్షణలో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే 2.3 కిలోమీటర్ల మేర బీటీ (డాంబర్) రోడ్డు విస్తరించారు. కిష్టారెడ్డిపేట్ గ్రామంలో 425 మీటర్లు సీసీ రోడ్డు వేశారు. బీరంగూడ 250 మీటర్ల మేర సీసీ రహదారి వేశారు. దీంతో పాటు రూ.1.25 కోట్ల నిధులతో సెంటర్ లైటింగ్ సిస్టంతో కూడిన విద్యుత్ దీపాలు, రెండు వైపులా నీటి పారుదల కాలువల నిర్మాణానికి రూ.3 కోట్లు నిధులు కేటాయించారు. విద్యుత్ స్తంబాల మరమ్మతులకు రూ.3.40 కోట్లు ఖర్చు చేశారు. రహదారికి ఇరువైపులా గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు రోడ్డుకు లింక్ రహదారులను సైతం 20 నుంచి 30 మీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారికి పక్కనే ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్దకు 1.2 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ రహదారికి ఒక పెద్ద బ్రిడ్జితో పాటు 9 కల్వర్టులు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ రహదారి ఆగస్టు వరకు పూర్తి చేయనున్నట్లు హెచ్ఎండీఏ డీఈ దీపక్ కుమార్ తెలిపారు.
త్వరగా పూర్తిచేస్తాం..
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిష్టారెడ్డిపేట్ – బీరంగూడ రోడ్డు సమస్యను సీఎం కేసీఆర్కు వివరించాను. రోడ్డు విస్తరణకు నిధులు కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా నిధులు కేటాయించారు. నిధులు కేటాయించి రోడ్డు విస్తరణకు సహకరించిన ముఖ్యమంత్రికి అమీన్పూర్ ప్రజల తరఫున ధన్యవాదాలు. రహదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటా.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
గతంలో ఇరుకైన రోడ్లతో మున్సిపాలిటీ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్వర్యంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. సీఎం హామీతో ఈ మార్గానికి మోక్షం కలిగింది. రోడ్డు విస్తరణకు సహకరించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి రుణపడి ఉంటాం.
ఆనందంగా ఉంది..
కిష్టారెడ్డిపేట్ నుంచి బీరంగూడ వరకు రోడ్డు విస్తరించడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలో ఎంతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు సంతోషకరమైన విషయం. రోడ్డు విస్తరణ పూర్తయితే సాఫీగా ప్రయాణించవచ్చు. రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు.
నాణ్యత కూడిన పనులు..
కిష్టారెడ్డిపేట్ -బీరంగూడ రహదారి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నాం. హెచ్ఎండీఎ నిధులతో సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ యూసుఫ్ హుస్సేన్, ఈఈ అప్పారావు అధ్వర్యంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనుకున్న సమయానికి రోడ్డు పనులు పూర్తిచేస్తాం. స్థానిక ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రత్యేక కృషి, సహకారంతో చిన్న చిన్న అడ్డంకులు తొలిగిపోయి పనులు చకచకా జరుగుతున్నాయి.
-దీపక్, హెచ్ఎండీఎ డీఈ
చాలా ఇబ్బందులు పడ్డాం..
గతంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే భయంగా ఉండేది. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడంతో నిత్యం నరకం అనుభవించాం. ఇప్పుడు రోడ్డు పనులు ఇప్పుడు జరుగుతుండడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్లుగా ఇరుకుగా ఉన్న రోడ్డును విస్తరించడం హర్షనీయం. రోడ్డు విస్తరణకు కృషి చేసిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ధన్యవాదాలు.
-దత్తు,బీరంగూడ వాసి