హవేళిఘనపూర్, మే 24: మండల పరిధిలోని ఆయా గ్రామా ల్లో వైద్య, అంగన్వాడీ, పంచాయతీ అధికారులతో కూడిన బృందం సభ్యులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ సర్వేను నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని బి.తిమ్మాయిపల్లి గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ శివ్వమ్మ, పంచాయతీ సెక్రటరీ నవీన్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా కట్టడిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని వారు తెలిపారు.
కరోనా కట్టడికి కృషి చేయాలి ఎంపీపీ శేరి నారాయణరెడ్డి
కరోనా కట్టడిలో అందరు భాగస్వాములై ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు పాటించాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఉదయం 6 నుంచి 10వరకు మినహాయింపు ఇచ్చిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటకు రాకూడదన్నారు.పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలన్నారు.
చేగుంటలో..
చేగుంట, మే 24:గ్రామంలో ఎవరికైనా జ్వరం వస్తే తప్పని సరిగా తెలుపాలని కరీంనగర్ గ్రామ సర్పంచ్ అయిలపురం రఘుపతి అన్నారు. చేగుంట, కరీంనగర్, రాంపూర్, కర్నాల్పల్లి, చందాయిపేట్ గ్రామాల్లో రెండో విడత సర్వేను నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
వైద్యుల సూచనలను పాటించాలి
తూప్రాన్ రూరల్, మే 24: వైద్యుల సూచనలను పాటిస్తే కరోనా దరిదాపుల్లోకి రాదని తూప్రాన్ పట్టణ కౌన్సిలర్లు కుమ్మరి రఘుపతి, అరుణావెంకట్గౌడ్, మామిండ్ల జ్యోతికృష్ణ, రవీందర్, ఉమాసత్యలింగం ప్రజలకు సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లతో కలిసి సర్వేను నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి లక్షణాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. సర్వేకు ప్రజలు సహకరించినప్పుడే వ్యాధిగ్రస్తులు గుర్తించబడుతారన్నారు. సకాలంలో మందులు వాడితే వ్యాధి తగ్గుతుందన్నారు.