మెదక్ మున్సిపాలిటీ, జూలై 20 : హరితహారంలో భాగంగా మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఉద్యమంలా ఈ నెల 19 నుంచి చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగుతున్నదని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో పకడ్బందీగా మొక్కలు నాటడానికి మెదక్ మున్సిపాలిటీలో ప్రతిరోజు రెండు వార్డుల చొప్పున, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలలో ఒక్కో వార్డు చొప్పున కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. భూభాగంలో 33 శాతం అడవులు విస్తరించాల్సి ఉం డగా, మానవ అవసర రీత్యా చెట్లు నరకడంతో అటవీ విస్తీర్ణం తగ్గి వాతావారణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తునాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ప్రతిఒక్కరూ మొక్క లు నాటి సంరక్షించాలని కోరారు. ప్రధానంగా పట్టణాల్లో పచ్చదనాలు నెలకోల్పోడానికి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏ రోజు ఏ వార్డులో మొక్కలు నాటే ప్రణాళికను రూపొందించినట్లు ఆమె వివరించారు. హరితహార కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపినిచ్చారు.