వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. గంగమ్మ ఒడికి గణేశుడిని చేర్చేందుకు నిర్వహించిన శోభాయాత్రలు ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. తీన్మార్ చిందులు, డీజేల మోతలతో భక్త జనసందోహం నడుమ వినాయకుడికి వీడ్కోలు పలికారు. అంతకుముందు నిర్వహించిన లడ్డూ వేలం పాటలో భక్తులు పోటీపడ్డారు. ఒకరినిమించి మరొకరు ఉత్కంఠ భరితంగా వేలం పెంచుతూ లడ్డూలను దక్కించుకున్నారు. చెరువులు, కుంటల వద్ద అధికారులు నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. క్రేన్ల సహాయంతో గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు. నిమజ్జనాలను ఎప్పటికప్పుడు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించగా, పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు మెదక్ జిల్లాలోని ఆయా మండలాల్లోని పలు చెరువులు, కుంటల వద్ద నిమజ్జనాలు కొనసాగాయి.
నేత్రపర్వంగా సాగిన వినాయక నవరాత్రోత్సవాలు ముగించుకొని బొజ్జ గణపయ్య ఆదివారం రాత్రి గంగమ్మ ఒడికి చేరారు. భక్తులు నిర్వహించిన శోభాయాత్రలు ఉత్సాహంగా కొనసాగాయి. జై గణేశ్.. బైబై గణేశ్ అంటూ తీన్మార్ నృత్యాలతో భక్త జనసందోహం నడుమ వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరువులు, కుంటల వద్ద అధికారులు నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన కూడళ్లలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నిమజ్జనాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్ రెడ్డి రూ.10 లక్షలకు దక్కించుకున్నారు.
-సిద్దిపేట/సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ ,సెప్టెంబర్ 19
పటాన్చెరు, సెప్టెంబర్ 19: రుద్రారం గణేశ్ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి లడ్డూలకు వేలంపాట నిర్వహించారు. దేవదాయశాఖ, పాలకమండలి నిర్వహించిన లడ్డూ వేలానికి భక్తులనుంచి మంచి స్పందన వచ్చింది. వేలంలో రుద్రారం గ్రామానికి చెందిన సాబిద సాయికుమార్ రూ.6 లక్షలకు మొదటి లడ్డూను దక్కించుకోగా, రెండోది ఈదుల నాగులపల్లికి చెందిన బాలగోని సాయిచరణ్ గౌడ్ రూ.2.10 లక్షలకు, రుద్రారం గ్రామానికి చెందిన పట్నం నారాయణ మూడో లడ్డ్డూను రూ.1.50 లక్షలకు వేలంలో పాడారు. మూడు లడ్డూల వేలంలో రూ. 9.60లక్షల ఆదాయం సమకూరింది. అనంతరం నిర్వహించిన ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శోభా యాత్రంలో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని గణేశుడి రథాన్ని లాగారు. దేవస్థానం పాలకమండలి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు కావడంతో ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. గ్రామ సర్పంచ్ సుధీర్రెడ్డి, ఎంపీటీసీ మన్నెరాజు, హరిప్రసాద్ రెడ్డి, నాయకులు, భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు.
నేడు ఘనంగా గణనాథుడి శోభాయాత్ర
సిద్దిపేట, సెప్టెంబర్ 19 : సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నివాసంలో నెలకొల్పిన మట్టి గణపతి శోభాయాత్ర నేడు సోమవారం వైభవంగా జరిగేలా టీహెచ్ఆర్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగేలా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో వివిధ రకాల కళాప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చిందు యక్షగానం, లంబాడీ డ్యాన్స్, ఒగ్గు కళాకారుల నృత్యప్రదర్శన, బోనాలు, కోలాటం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు వినాయక శోభాయాత్ర జరుగుతుందన్నారు. ఈ శోభాయాత్రను మంత్రి హరీశ్రావు ప్రారంభిస్తారన్నారు. ప్రజల శుభం కోరి ఈ ఉత్సవాలు నిర్వహించామని నియోజకవర్గ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.