మెదక్, మే 13 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జర సర్వేను మెదక్ జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈ నెల 6న ప్రారంభమైన ఇంటింటి సర్వే జిల్లా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేసి సర్వేను చేపడుతున్నారు. రెండో దశ కరోనా ఉధృతితో జిల్లాలో అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు ఇంటింటా సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులను పరీక్షిస్తున్నారు.
1030 మంది అంగన్వాడీలు, 2500 ఆశ వర్కర్లు…
మెదక్ జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 1076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 885 ప్రధాన అంగన్వాడీల్లో 847 మంది అంగన్వాడీ టీచర్లు ,191 మినీ అంగన్వాడీల్లో 183 మంది అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. జిల్లాలో 2500 మంది ఆశ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జర సర్వేలో 1030 మంది అంగన్వాడీ టీచర్లు, 2500 మంది ఆశ వర్కర్లు పాల్గొంటున్నారు. ఒక బృందంలో ఆశ కార్యకర్త, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంతో పాటు పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీ అయితే మెప్మా, ఆర్పీ సిబ్బంది ఉన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, దగ్గు లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి మెడికల్ కిట్లు అందజేస్తున్నారు. గ్రామాల్లో కుటుంబ సభ్యుల వివరాలను అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు సేకరించి వైద్య సిబ్బందికి అందజేస్తున్నారు.
97 శాతం పూర్తి..
మెదక్ జిల్లాలో చేపట్టిన ఇంటింటా సర్వే బుధవారం నాటికి 97 శాతం పూర్తయింది. జిల్లాలో 1,71,135 ఇండ్లు ఉండగా, బుధవారం వరకు 1,64,831 ఇండ్లల్లో సర్వే పూర్తి చేశారు. ఈ సర్వేలో 512 బృందాలు పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లాలోని 20 పీహెచ్సీలు ఉండగా, అందులో సుమారుగా 20 పీహెచ్సీల్లో ఇంటింటా జరం సర్వే పూర్తి చేశారు.