సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందజేస్తున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇండ్ల ఎదుట, పెరడు భాగం, వారికి సంబంధించి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుకునేందుకు వీలుగా పూలు, పండ్లు, ఔషధ మొక్కలను అధికారులు అందజేస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీల్లో ఇది వరకే నర్సరీలను ఏర్పాటు చేశారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందజేసేందుకు పూలు, పండ్లు, ఔషధ మొక్కలను నర్సరీల్లో పెంచారు. ఇంటింటికీ ఆరు రకాల మొక్కలను అందజేయడంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఉపయోగకరమైన జామ, నేరేడు, దానిమ్మ, గులాబీ, కృష్ణతులసి, నిమ్మ తదితర మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ప్రజలు వీటిని తమ పెరడు, ఇంటి ఎదుట ఖాళీ స్థలాల్లో నాటుతున్నారు. అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో 2,32,404 గృహాలు ఉన్నాయి. ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున 14.18 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, ఇప్పటి వరకు జిల్లాలో 7,86,657 మొక్కలను పంపిణీ చేశారు. రాబోయే మూడు రోజుల్లో మరో ఆరు లక్షల మొక్కలు పంపిణీ పూర్తి చేయనున్నారు. దీంతో వందశాతం లక్ష్యం పూర్తి కానుంది. ఇవి కాకుండా గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 647 పంచాయతీల్లో 24,413 మొక్కలను రహదారులు ఇరువైపులా నాటారు. ఇతర పొలాలు, చెరువు గట్లపైనా రైతులు 63,685 మొక్కలను నాటారు.
ఇంటింటా పచ్చదనం..
పల్లె ప్రగతిలో మొక్కలు నాటే కార్యక్రమానికి అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తున్నది. ఇంటింటికీ మొక్కలు నాటడంతో గ్రామాల్లోని ఇండ్లలో పచ్చదనం పరుచుకోనున్నది. ప్రతి ఇంట్లో పూలు, పండ్ల, ఔషధ మొక్కలు ఉంటే లాభదాయకంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం, ఆ మేరకు వాటిని అందజేస్తున్నది. పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కోరిన మొక్కలను అందిస్తున్నారు. మొక్కలు అందినట్లు ఇంటి యజమాని నుంచి ధ్రువీకరణ సంతకం తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల, కోహీర్, మొగుడంపల్లి, నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ మండలాల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ వందశాతం పూర్తయింది. గుమ్మడిదల మండలంలో 14,826, కోహీర్లో 27,408, మొగుడంపల్లిలో 18,738, నారాయణఖేడ్లో 42,006, సంగారెడ్డిలో 14,934, జహీరాబాద్లో 36,780 మొక్కలను పంచాయతీ సిబ్బంది పంపిణీ చేశారు. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్న పటాన్చెరు మండలంలో ఇప్పటి వరకు అత్యధికంగా 54,194 మొక్కలు పంపిణీ చేశారు. అందోల్ మండలంలో 44,772, సదాశివపేటలో 44,342, హత్నూరలో 40,374, కొండాపూర్లో 40,755, పుల్కల్ మండలంలో 38,557, కల్హేర్లో 37,442, ఝరాసంగంలో 37,331, నాగల్గిద్దలో 36,494, రాయికోడ్లో 32,726, న్యాల్కల్లో 32,119 మొక్కల పంపిణీ చేశారు. మిగతా మండలాల్లో 25 నుంచి 30వేల లోపు మొక్కలను పంపిణీ చేశారు. రాబోయే మూడు రోజుల్లో ఇంటింటికీ ఆరు చొప్పున వందశాతం మొక్కల పంపిణీ పూర్తి చేయనున్నారు. మున్సిపాలిటీల్లో సైతం ఇంటింటికీ మొక్కల పంపిణీ చురుగ్గా సాగుతున్నది.