నకిలీ విత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి
పాస్లు లేకుండా రోడ్డెక్కే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలి
ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీసులకు అభినందనలు
జిల్లాలో లాక్డౌన్ అమలు బాగుంది
హైదరాబాద్ రీజియన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర
సిద్దిపేట టౌన్, జూన్ 3: కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ప్రజలు కనబరుస్తున్న ఐక్యత అభినందనీయమని ఐజీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సిద్దిపేటలో లాక్డౌన్ బందోబస్తును గురువారం క్షేత్రస్థాయిలో సీపీ జోయల్ డెవిస్తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా, ముస్తాబాద్, నర్సపురం ఎక్స్రోడ్, ఎల్లమ్మ దేవాలయం చౌరస్తా, సుభాశ్, గాంధీ రోడ్, రాజీవ్ రహదారి, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతుందన్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, సిబ్బందిని అభినందించారు. సిద్దిపేట జిల్లాలో పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛంధంగా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు సహకరించుకోవడం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. అంతకుముందు పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ హాల్ను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆయన వెంట హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐలు ఆంజనేయులు, పర్శరాములుగౌడ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ప్రవీణ్కుమార్, ఎస్సైలు రాకేశ్, నరేందర్రెడ్డి, పోలీసులు ఉన్నారు.
నకిలీ విత్తనాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
గజ్వేల్, జూన్ 3 : జిల్లాలో నకిలీ విత్తనాలు లేకుండా పటిష్టంగా వ్యవహరించాలని ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. గురువారం గజ్వేల్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్, ఏసీపీ నారాయణ ఇతర పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాల కంపెనీల గురించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించారు. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ప్రజలు మాస్క్ ధరించి కొవిడ్ నిబంధనలను పాటిస్తున్న తీరుతెన్నులను పరిశీలించారు. ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్లు,ప్రజల జీవన విధానాన్ని పరిశీలించారు. అనంతరం గజ్వేల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రమీద్ కొవిడ్ పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స పొం దుతున్నాడు. ప్రమీద్ను ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర పరామర్శించి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
దొమ్మాటను సందర్శించిన ఐజీ
చేర్యాల, జూన్ 3 : మండలంలోని పాత దొమ్మాట గ్రామాన్ని ఐజీ స్టీఫెన్ రవీంద్ర సిద్దిపేట సీపీతో కలిసి సందర్శించారు. గ్రామంలో కేసులు రెండు మాత్రమే నమోదు కావడంతో తీసుకుంటున్న చర్యలను తెలుసుకునేందుకు గురువారం గ్రామానికి వచ్చారు. సందర్భంగా ఐజీ గ్రామ కార్యదర్శి రాజును కొవిడ్ కేసులతో పాటు వైరస్ నివారణకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యదర్శి రాజుతోపాటు పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశకార్యకర్తలను సన్మానించారు. ఆయన వెంట ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, అడిషనల్ ఎస్పీ, ఇన్చార్జి ఏసీపీ మహేందర్, తహసీల్దార్ గియాసున్నీసాబేగం, ఎంపీవో కిషోర్, ఎస్సై రాకేశ్, ఏపీవో మంజుల, ఎంపీటీసీ ముచ్చంతుల వినోదచుక్కారెడ్డి ఉన్నారు.