ఆక్సిజన్ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలి
కొవిడ్ బాధితులకు ఇబ్బందులు కలుగనివ్వొద్దు
అవసరానికి సరిపడేలా ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలి
సాధ్యమైనంతమేర ఆక్సిజన్ బెడ్లను పెంచాలి
టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
ములుగు, మే 1 : సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రం ములుగులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా వైద్యాధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, జిల్లాస్థాయి అధికారులతో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వెంటిలేషన్ ఆధారిత చికిత్స పొందుతున్న బాధితులకు నిరంతర ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ నిల్వలు పెంచడం, పడకల సంఖ్య పెంచడం, కొవిడ్కేర్ సెంటర్ పనితీరు తదితర అంశాలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడారు. కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వలను నిరుపయోగం చేయకుండా ఉన్న దానిని హేతుబద్దంగా గరిష్ఠ స్థాయిలో కొవిడ్ బాధితులకు ఉపయోగించుకునేలా ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని సూచించారు. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు గల కొవిడ్ బాధితుల కోసం సిద్దిపేట ప్రభుత్వ జిల్లా జనరల్ దవాఖాన సమీపంలోని నైట్ షెల్టర్లో 70 బెడ్ల సామర్థ్యంగల కొవిడ్ కేర్ సెంటర్ను అన్ని సదుపాయాలు, భోజన వసతి, మందులు, వైద్య సిబ్బందిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆక్సిజన్ సరఫరా డేటా సేకణకు సంబంధించి సిద్దిపేట జిల్లా సమన్వయకర్గగా ఐఏఎస్ అధికారి హేమంత్ పాటిల్ను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. జిల్లాలోని రోజువారి ఆక్సిజన్ వినియోగం, నిల్వలకు సంబంధించిన రిపోర్ట్ను ప్రతిరోజు తనకు అందించాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరుసు, వైద్యాధికారులు డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ మహేశ్ పాల్గొన్నారు.