‘సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ-2022’ సీజన్-2 సమరం ఫైనల్స్ బుధవారం ఉత్సాహ, ఉత్కంఠభరితంగా సాగింది. ముండ్రాయి జట్టుపై ఎంసీసీ జట్టు విజయకేతనం ఎగురవేసింది. విజేత జట్టుకు మంత్రి హరీశ్రావు రూ.లక్షతో పాటు ట్రోఫీ అందించారు. రన్నరప్గా నిలిచిన ముండ్రాయి జట్టుకు రూ.50వేల నగదు, ట్రోఫీ అందించారు. ముగింపు కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, సినీ నటుడు సుమన్ తదితరులు హాజరయ్యారు.
– సిద్దిపేట, ఏప్రిల్ 20
సిద్దిపేట, ఏప్రిల్ 20: ‘పట్టుదలతో కష్టపడితే విజయం లభిస్తున్న ది.. యువత జీవితం లో ఆల్రౌండర్లుగా ఎదగాలి.. సీఎం కేసీఆర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఇదే స్ఫూర్తితో మరింత మంది క్రీడాకారులు రంజీ జట్టు, జాతీయ క్రికెట్ జట్టుకు ఆడాలి’ అని మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. బుధవారం రాత్రి జరిగిన సీఎం కేసీఆర్ ట్రోఫీ సీజన్ -2 ఫైనల్ మ్యాచ్కు భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజ్, సినీ హీరో సుమన్, హెచ్సీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఖాద్రితో కలిసి ఫైనల్ మ్యాచ్ వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిందని, గతంలో రంజీ ట్రోఫీకి సిద్దిపేట నుంచి ఇద్దరు ప్లేయర్లు ఆడగా, ఈసారి మరో ముగ్గురు సెలక్టు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. రూరల్, అర్బన్ జట్టు కలిపి ఆడిన గతేడాది విజేతలు ఫైనల్కు రావడం వారి శ్రమ, పట్టుదలను సూచిస్తున్నదన్నారు. ఓడిపోయిన జట్లు కుంగిపోకుండా మరింత పట్టుదలతో శ్రమించాలన్నారు. క్రీడాకారులు ఇదే క్రీడాస్ఫూర్తి కొనసాగించాలన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఆల్రౌండర్లుగా ఎదగాలన్నారు.
సిద్దిపేట క్రీడాహబ్గా మార్చామన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫుట్బాల్ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరమ న్నారు. సినీ హీరో సుమన్ నటుడిగా, కరాటే ప్లేయర్గా అద్భుతంగా ఆల్రౌండర్గా ఎదిగారన్నారు. అన్నమయ్య సినిమాలో సుమన్ను చూస్తే వేంకటేశ్వరస్వామిని చూసినట్లే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇచ్చి వంటావార్పులో పాల్గొనట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. వెంకటపతిరాజ్ రెండుసార్లు వరల్డ్ కప్ ఆడిన భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు నైతికంగా విజయం సాధించాయని, అద్భుతంగా ఆడారన్నారు. ఈ సందర్భంగా సినీ హీరో మాట్లాడుతూ సిద్దిపేట పట్టణాన్ని హైదరాబాద్తో సమానంగా మంత్రి హరీశ్రావు అభివృద్ధి చేశారన్నారు. అనుమతి ఇస్తే ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తామన్నారు. ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అద్భుతంగా సాగిందన్నారు. సీఎం కేసీఆర్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిందన్నారు. హెచ్సీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఖాద్రి మాట్లాడుతూ ఐపీఎల్ కంటే మరింత క్రేజ్గా ఈ ట్రోఫీలోని మ్యాచ్లు సాగాయన్నారు. సిద్దిపేట నుంచి మరో ముగ్గురు క్రీడాకారులు రంజీకి ఆడనున్నారని తెలిపారు.