మెదక్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో అవకాశవాదులకు అవకాశం ఇవ్వకుండా, ఆడబిడ్డగా ఆదరించి మరోసారి అవకాశం ఇస్తే మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో హవేళీఘనపూర్ మండల పరిధిలోని ముత్తాయిపల్లి, నాగారం, చిన్నశంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 300 మంది మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చే రారు. వారికీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఇకడ ఎమ్మెల్యేగా పనిచేసిన వారు పదవీకాలంలో కూడా నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు.
13 ఏండ్ల పాటు నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా ఎన్నికల రాగానే కొడుకును తీసుకువస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమానికి సమప్రధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఇతర పార్టీలో నుంచి చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కొత్త, పాత అని తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తిరుపతి రెడ్డి, హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, హవేళీఘనపూర్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.