మెదక్ రూరల్, ఏప్రిల్ 26 : మంజీరా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా పేరూరులోని గరుడగంగ సరస్వతీ అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నదికి బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మకు పసుపు, కుంకుమతో వాయినాలు సమర్పించారు. కొందరు భక్తులు పిండ ప్రదానం చేశారు. చదవుల తల్లి సరస్వతీ మాతను దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు.
ఆలయ వ్యవస్థాపకుడు దోర్బల రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో గుణకార్శర్మ, మహేశ్శర్మ సరస్వతీ మాతను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మంజునాథుడికి 1008 కలశాలతో అభిషేకం చేశారు. మంజునాథుడిని ఊరేగింపుగా తీసుకువచ్చి మహా జలాభిషేకం నిర్వహించారు. ప్రతీ రోజు అభిషేకం, సహస్ర కలశాలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు.