ఈ ఏడాది మామిడి రైతులకు కలిసొచ్చింది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా నష్టపోయినా ప్రస్తుతం మంచి ధర లభిస్తున్నది. ఏప్రిల్లో గాలిదుమారం వర్షాలు పడడంతో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. తేమ శాతం అధికంగా ఉండడంతో చిగుర్లు ఎక్కువగా వచ్చి.. పూత తగ్గడంతో కాపు అంతగా రాలేదు. దీంతో ఇప్పుడు ఉన్న కొద్దిపాటి కాయలకు మార్కెట్లో డిమాండ్ అధికమైంది. మెదక్ జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖ అంచనా వేస్తున్నది. ప్రధానంగా బంగినపల్లి, దశరి, కేసరి, చిన్నరసం, పెద్ద రసం లాంటి రకాలను పండిస్తున్నారు. బంగినపల్లికి క్వింటాల్ ధర రూ.45వేల నుంచి 50 వేల పలుకుతున్నది. రాబోయే రోజుల్లో మరింత పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మెదక్లో పండిస్తున్న మామిడిని తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పలు మండలాల్లో కూలీలు టంకర తయారు చేసి నిజామాబాద్ మార్కెట్కు తీసుకెళ్లి బీట్లో విక్రయిస్తున్నారు. క్వింటాల్ టంకర నాణ్యతను బట్టి రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఉంది.
మెదక్, మే 28 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా రెండేండ్లుగా నష్టాలు చవిచూసిన మామిడి రైతులకు మంచి రోజులొచ్చాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మార్కెట్లో మామిడికి డిమాండ్ పెరిగింది. ఈసారి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి బంగినపల్లి మామిడి క్వింటాలుకు రూ.45 వేల నుంచి రూ.50 వేలు పలుకుతుందని భావిస్తున్నారు.
మెదక్ జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగు
మెదక్ జిల్లాలో 3 వేల ఎకరాల్లో మామిడి సాగుచేశారు. ప్రతి ఏటా జూన్లో వర్షాలు ప్రారంభమై సెప్టెంబర్ వరకు కురుస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్లో గాలి దుమారంతో పాటు వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ పొలాలన్నీ నీటితో తడిసిపోయాయి. పొలంలో తేమ శాతం అధికంగా ఉండడంతో ఎక్కువగా చిగుర్లు రావడం, పూత తగ్గడంతో అనుకున్న మేర కాత రాలేదు. దీంతో పంట దిగుబడి తగ్గింది. ప్రస్తుతం ఉన్న కాయలకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి మామిడి కాయలు వస్తున్నాయి. జూన్ చివరి వరకు కాయలు కనిపించనున్నాయి.
ఆశాజనకంగా మామిడి ధరలు
మెదక్ జిల్లావ్యాప్తంగా సుమారు 3వేల ఎకరాలు అంటే 1200 హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్టు ఉద్యానవన శాఖ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం బంగినపల్లి మామిడికి మంచి డిమాండ్ ఉంది. క్వింటాల్కు రూ.45 వేల నుంచి రూ.50వేల వరకు పలుకుతున్నది. గత ఏడాది రూ.25 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో మామిడికాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో ధర రూ.45 వేల వరకు ఉంది. రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉన్నదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టంకర్లతో ఉపాధి
జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, కొల్చారం, చేగుంట, నర్సాపూర్, టేక్మాల్, రేగోడ్, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట తదితర మండలాలకు చెందిన కూలీలు టంకర్లు తయారుచేస్తారు. ఇది ఎక్కువగా మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లోని గంగాపూర్, శమ్నాపూర్ అధికంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో టంకర్లు తయారు చేసి, నిజామాబాద్ మార్కెట్లో బీట్కు తీసుకెళ్లి విక్రయించేవారు. తెలంగాణలో ఒక్క నిజామాబాద్లోనే ఈ బీట్ ఉంది. ఈ బీట్లో క్వింటాల్ టంకర్కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతుంది. టంకర్కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీం తో టంకర్ తయారు చేస్తూ కూలీలు ఉపాధి పొందుతున్నారు.
ఇతర రాష్ర్టాలకు మామిడి…
మెదక్ జిల్లాలో పండిస్తున్న మామిడికి ఇతర రాష్ర్ర్టాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన మామిడి కాయలకు మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలిస్తున్నారు. విజయవాడ, కృష్ణ జిల్లాల నుంచి కూడా మెదక్ జిల్లాకు మామిడి కాయలు సరఫరా చేస్తారు. మెదక్ జిల్లాలో రకరకాల మామిడి కాయలు పండిస్తున్నారు. ప్రధానంగా బంగినపల్లి, దశేరి, కేసరి, చిన్నరసం, పెద్ద రసం లాంటి రకాలు పండిస్తున్నారు. వ్యవసాయాధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. దీంతో ధర పలికే మామిడి సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రతీ సీజన్లో ఇక్కడి సరుకును వ్యాపారులు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు.
తోడ్పాటునందిస్తున్న ఉద్యానవన శాఖ
మెదక్ జిల్లాలో మామిడి పంట అధికంగా సాగుచేస్తారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉండడంతో ధర బాగానే ఉంది. జిల్లావ్యాప్తంగా సుమారు 3వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బంగినపల్లి మామిడి క్వింటాల్కు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతున్నది. ఈసారి మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తున్నది.
– నర్సయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి, మెదక్